గీతం కబ్జా పనులు
కలెక్టర్కు వైఎస్సార్సీపీ నేతలు, సామాన్య ప్రజలు విజ్ఞప్తి గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వందలాది మందిని అడ్డుకున్న పోలీసులు 200 మందినే అనుమతించిన పోలీసులు అక్కడ కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ హైడ్రామా గట్టిగా నిలదీసిన వైఎస్సార్ సీపీ నేతలు అయినా పరిమిత సంఖ్యలోనే ఫిర్యాదుల స్వీకరణ
గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో నిర్మాణ పనులు చేపడుతోందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా నేతలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మంత్రి నారా లోకేష్కు బంధువైన విశాఖ ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీపై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, ఆ భూమిలో జరుగుతున్న పనులను వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు.
అక్రమ క్రమబద్ధీకరణపై ధ్వజం
సుమారు రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీ ఆక్రమించిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఈ భూమిని జీవీఎంసీ సమావేశంలో వివాదాస్పదంగా క్రమబద్ధీకరించారని, ఆ సమయంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను సమావేశానికి అనుమతించలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ భూకబ్జా వ్యవహారం కోర్టు విచారణలో ఉన్నప్పటికీ, హెచ్చరిక బోర్డులను తొలగించి గీతం యాజమాన్యం భూమిని చదును చేస్తూ నిర్మాణ పనులు ప్రారంభించిందని పేర్కొన్నారు.
పోరాటం కొనసాగిస్తాం..
ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ, గీతం యూనివర్సిటీ భూకబ్జాపై వందలాది మంది ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పటికీ పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడటానికి వైఎస్సార్సీపీ ఎలాంటి ఉద్యమానికై నా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అధికారులు ప్రభుత్వానికి వత్తాసు పలకకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని, వెంటనే గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిలో జరుగుతున్న పనులను ఆపాలని డిమాండ్ చేశారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమిని కాపాడటానికి ప్రజా సంఘాలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.
పనులు ఆపకుంటే తర్వాత కూల్చేస్తాం..
మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని గీతం యూనివర్సిటీ కబ్జా భూమిలో జరుగుతున్న పనులను నిలిపివేయాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. కూటమిలో ఉన్న బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోతే అది పెద్ద మచ్చగా మారుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, ముఖ్య నాయకులు కోలా గురువులు, బాణాల శ్రీనివాస్, కొండా రాజీవ్గాంధీ, రొంగలి జగన్నాథం, జహీర్ అహ్మద్, పోతిన హనుమంతురావు, ఉమ్మడి స్వాతిదాస్, కోడిగుడ్ల పూర్ణిమ, పి.వి.నారాయణ, తాడి జగన్నాథ రెడ్డి, ఎం.నాగమల్లేశ్వరి, పల్లా దుర్గారావు, పేర్ల విజయచంద్ర, ద్రోణంరాజు శ్రీవత్సవ, రవిరాజు, కటారి అనిల్ కుమార్, కర్రి రామిరెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, సాహిక్ ఖాన్, మార్కండేయులు, శివరామకృష్ణ, కొణతాల ఉమామహేశ్వరరావు, శ్రీదేవి వర్మ, బర్కత్ అలీ, కోడూరి సత్యనారాయణ, సనపల రవీంద్ర భరత్, పళ్లా చిన్నతల్లి, అల్లంపల్లి రాజబాబు, ఆల్ఫా కృష్ణ, కె.బి.పి.ఎం.కుమార్ జైన్, సాడి పద్మావతి, శశికళ, గుడివాడ లతీష్, దొడ్డి కిరణ్, కె.రామన్నపాత్రుడు, కోడిగుడ్ల శ్రీధర్, బోగాది సన్యాసిరావు, ధర్మాల శ్రీనివాసరావు, పి.ఈశ్వరరావు, పీతల గోవింద్, రావళ్ల సత్యనారాయణ, బి.గోవింద్ రాజు, బొద్ద గోవింద్, గొండేసి శ్రీనివాస్ రెడ్డి, బోగావిల్లి గోవింద్, జి.వెంకట రెడ్డి, పైడి రామన్, ఆదారి శ్రీనివాస్, బల్ల శ్రీనివాస్, లాలం వేణుగోపాల స్వామి, దొప్ప శ్రీను, ఐ.రవి కిరణ్, కె.సుకుమార్, బి.గణేష్, యర్యంశెట్టి శ్రీనివాస్, బి.శ్యామ్కుమార్ రెడ్డి, మువ్వల సురేష్ పాల్గొన్నారు.
పోలీసుల అడ్డగింత.. కలెక్టరేట్ వద్ద హైడ్రామా
విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు నేతృత్వంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావుతో పాటు వందలాది మంది కార్యకర్తలు, ప్రజలు కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదు చేయడానికి బయలుదేరారు. అయితే సుమారు వెయ్యి మంది వరకు వచ్చిన వారిని కలెక్టరేట్ వద్దే పోలీసులు అడ్డుకుని, కేవలం 200 మందికే లోపలికి అనుమతి ఇచ్చారు. లోపలికి వెళ్లిన తర్వాత కూడా అంతమంది నుంచి ఫిర్యాదులు స్వీకరించలేమని, కంప్యూటర్లు పనిచేయడం లేదని గ్రీవెన్స్ అధికారులు చెప్పడంతో వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి పరిమిత సంఖ్యలోనే జిల్లా అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు.


