
నగరాభివృద్ధి, సుందరీకరణే లక్ష్యం
కమిషనర్ కేతన్ గార్గ్
డాబాగార్డెన్స్: నగరాభివృద్ధి, సుందరీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లు ఒప్పందం ప్రకారం నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేసేలా చూడాలని, ఈ పనుల్లో వార్డు ఎమినిటీ కార్యదర్శులను భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జోన్ల వారీగా చేపట్టిన పనులు, పూర్తయిన పనుల పురోగతి, ఖర్చు చేసిన నిధులపై ఆరా తీశారు. అన్ని జోన్లలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర నివేదిక అందించాలని పర్యవేక్షక ఇంజినీర్లను ఆదేశించారు. నగరంలో చేపట్టిన బీటీ, సీసీ రోడ్లు, కాలువలు, తాగునీటి పైప్లైన్లు, భూగర్భ కేబుల్ పనుల వివరాలను ఇంజినీర్లు కమిషనర్కు వివరించారు. అనంతరం మధురవాడలో చేపట్టబోయే భూగర్భ మురుగునీటి పారుదల ప్రాజెక్టు పనులపై ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతినిధులతో కమిషనర్ సమీక్షించారు. సింహాచలం గిరి ప్రదక్షిణ మార్గం, బీచ్ నుంచి ఎండాడకు అనుసంధాన మార్గం, అనకాపల్లి పెరుగు బజార్ రోడ్డు, పలు మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులు, తగరపువలస–చిల్లపేట పైప్లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి వీఐపీ రోడ్డు వరకు ఉన్న సెంట్రల్ మీడియన్లో పచ్చదనం పెంచాలని, రోడ్లపై జీబ్రా క్రాసింగ్లు, కూడళ్ల వద్ద అవసరమైన పెయింటింగ్ పనులు చేపట్టాలని, వీటికి సంబంధించిన అంచనాలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో పర్యవేక్షక ఇంజినీర్లు గోవిందరావు, కేవీఎన్ రవి, పీవీవీ సత్యనారాయణరాజు, సంపత్కుమార్, కె.శ్రీనివాసరావు, వై.కృష్ణారావులతో పాటు పలువురు కార్యనిర్వాహక ఇంజినీర్లు పాల్గొన్నారు.

నగరాభివృద్ధి, సుందరీకరణే లక్ష్యం