
ఆస్పత్రుల్లో అవయవదానం బోర్డుల ఏర్పాటు
ఆరిలోవ: ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవయవదానంపై అవగాహన కలిగించే బోర్డులను ఏర్పాటు చేయాలని అవయదాన రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో ఈస్ట్ జోన్ జిల్లాల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు, అధికారులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. అవయదానం విధివిధానాలపై చర్చించారు. వైద్యుల నుంచి సూచనలు, సలహాలు సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 73 ఆస్పత్రులను జీవనదాన్ కింద నమోదుచేసినప్పటికీ వాటిలో సుమారు 50 శాతం ఆస్పత్రుల్లో ఒక్క బ్రెయిన్ డెడ్ కేసు కూడా నమోదుకాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ కేసులు జరుగుతున్నప్పటికీ, వాటిని నమోదుచేసి ప్రకటించడంలో ఆయా ఆస్పత్రుల వైద్యాధికారులు ఆసక్తి చూపడంలేదన్నారు. అవయదానంపై రోగి బంధువులకు సరైన అవగాహన లేకపోవడంతోపాటు, అవయవాలను శరీరం నుంచి బయటకు తీయడానికి సరైన వైద్యులు అందుబాటులో లేకపోవడం కూడా కారణమన్నారు. అందుకే ప్రతి ఆస్పత్రిలో తప్పనిసరిగా అవయదానంపై హెల్ప్ డెస్క్, అవగాహన కోసం బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ ఆస్పత్రిలోనైనా బ్రెయిన్ డెడ్ శరీరం నుంచి భాగాలు తీసేందుకు వైద్యులు అందుబాటులో లేకపోతే, తన దృష్టికి తీసుకురావాలన్నారు. విమ్స్లో ఇంత వరకు మూడు బ్రెయిన్ డెడ్ కేసులను ప్రకటించి అవయవాలు స్వీకరించామన్నారు. ఆస్పత్రుల నిర్వాహకులు మానవతా దృక్పథంతో ఆలోచిస్తే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. పలు ఆస్పత్రుల వైద్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
వైద్యుల సమావేశంలో అవయవదాన
రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె.రాంబాబు