అమ్మను తిట్టాడని... కర్రతో కొట్టి చంపేశాడు! | - | Sakshi
Sakshi News home page

అమ్మను తిట్టాడని... కర్రతో కొట్టి చంపేశాడు!

Jun 27 2025 4:07 AM | Updated on Jun 27 2025 4:07 AM

అమ్మను తిట్టాడని... కర్రతో కొట్టి చంపేశాడు!

అమ్మను తిట్టాడని... కర్రతో కొట్టి చంపేశాడు!

పెదగంట్యాడ: తోటి కార్మికుడు తన తల్లిని, అక్కలను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, నిద్రిస్తున్న తనను కాలితో తన్నాడన్న తీవ్ర ఆగ్రహంతో ఓ వ్యక్తి అతడిని కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆటోనగర్‌లో ఇటీవల కలకలం రేపిన ఈ హత్య కేసును న్యూపోర్టు పోలీసులు ఛేదించారు. నిందితుడిని గురువారం అరెస్ట్‌ చేశారు. న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో గాజువాక ఏసీపీ త్రినాథ్‌ హత్య కేసు వివరాలను వెల్లడించారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తార్‌ జిల్లా జగదల్‌పూర్‌ తాలుకా నియానార్‌కు చెందిన నరేష్‌ కశ్యప్‌, బిలోరికి చెందిన మహాదేవ్‌ భగేల్‌(28) ఇద్దరూ పెదగంట్యాడ ఆటోనగర్‌లోని శ్రీకృష్ణ ఇంజినీరింగ్‌ యార్డులో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 22న సెలవు దినం కావడంతో వారిద్దరూ యార్డులోనే ఉన్నారు. ఆ సమయంలో నరేష్‌ గదిలో నిద్రపోతుండగా, మహాదేవ్‌ వచ్చి అతడిని కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా నరేష్‌ తల్లిని, సోదరీమణులను దుర్భాషలాడాడు. ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నరేష్‌.. పక్కనే ఉన్న చపాతీ కర్రతో మహాదేవ్‌ వీపుపై, తలపై బలంగా కొట్టడంతో అది విరిగిపోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న మరో చెక్క బల్లతో మెడపై రెండుసార్లు బలంగా మోదడంతో మహాదేవ్‌ అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. అనంతరం మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి సమీపంలోని పొదల్లో పడేసి, తన బ్యాగ్‌ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఒకే ఒక్క ఫోన్‌ కాల్‌..

హత్య చేసిన తర్వాత యార్డ్‌ నుంచి బయటకు వచ్చిన నరేష్‌, సమీపంలోని ఓ వ్యక్తి ఫోన్‌ తీసుకుని తన బంధువులకు కాల్‌ చేశాడు. తాను మహాదేవ్‌ను చంపేశానని, ఇంటికి తిరిగి వస్తున్నానని చెప్పాడు. ఈ కేసును సవాలుగా తీసుకున్న న్యూపోర్టు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు తన స్వగ్రామానికి వెళ్తున్నాడని భావించి ఒక బృందాన్ని చత్తీస్‌గఢ్‌కు పంపారు. అయితే నిందితుడు చేసిన ఆ ఒక్క ఫోన్‌ కాల్‌ ఆధారంగా పోలీసులు కేసు చిక్కుముడిని విప్పారు. కాల్‌ చేసిన నంబర్‌ను ట్రేస్‌ చేసి, ఆ ఫోన్‌ యజమానిని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు ఇంకా పెదగంట్యాడలోనే ఉన్నాడని నిర్ధారించుకున్న పోలీసులు.. వెంకన్నపాలెం జంక్షన్‌ వద్ద అతడిని చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ హత్య కేసును ఛేదించిన న్యూపోర్టు పోలీసులను నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి అభినందించారు. సమావేశంలో న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు, ఎస్‌ఐ శ్యామ్‌సుందర్‌ పాల్గొన్నారు.

ఆటోనగర్‌ హత్య కేసును ఛేదించిన

పోలీసులు

ఫోన్‌కాల్‌తో దొరికిన హంతకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement