
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖలో మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఆందోళన బాట పట్టిన జీవీఎంసీ నీటి సరఫరా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. జీతాలు పెంచలేదంటూ ఉద్యోగులు సమ్మెకు దిగారు. జీవీఎంసీ పరిధిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 1250 మంది వాటర్ సప్లై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. నిన్నటి నుంచి నీటి సరాఫరాను జీవీఎంసీ నిలిపివేసింది. ఇప్పటికే కేజీహెచ్, ఎయిర్ పోర్ట్కు నీటి సరాఫరా నిలిచిపోయింది. 11వ తేదీ నుంచి సమ్మె చేస్తామని నీటి సరఫరా ఉద్యోగులు హెచ్చరించిన కానీ అధికారులు పట్టించుకోలేదు.
తాడేపల్లి: మరో వైపు, ఏపీ సీడీఎంఏ కార్యాలయం ముట్టడికి మునిసిపల్ ఇంజనీరింగ్, వాటర్, లైట్స్, టౌన్ ప్లానింగ్, పార్కింగ్ ఇతర సిబ్బంది పిలుపునిచ్చారు. ముట్టడికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. మున్సిపల్ కమిషనరేట్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముట్టడికి పూనుకుంటే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించారు. గత 50 రోజులుగా మునిసిపల్ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఆందోళన చేపట్టారు.