
మ్యాట్ల కోసం కొట్లాట.. టాయిలెట్ల కోసం తోపులాట
● యోగాంధ్రలో ప్రజలు అవస్థలు ● ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3.03 లక్షలకు పైగా జనసమీకరణ ● సగం మందికే యోగా మ్యాట్లు.. అల్పాహారం కిట్లు.. ● యోగాసనాల తర్వాత బస్సుల కోసం కిలోమీటర్లు నడక
విశాఖ సిటీ: యోగాంధ్ర కార్యక్రమం ప్రజల సహనానికి పరీక్ష పెట్టింది. యోగాభ్యాసకులకు సైతం ముచ్చెమటలు పట్టించింది. అర్ధరాత్రి ప్రజలను తరలించడం.. అందుబాటులో టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడం.. యోగాసనాల తర్వాత బస్సుల కోసం కిలోమీటర్ల మేర నడిపించడంతో విసిగెత్తిపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విద్యార్థులకు అర్ధరాత్రి 12 గంటలకే రుషికొండకు తరలించారు. దీంతో వారు రోడ్ల మీదే నిద్రపోయారు. అలాగే తరలించిన వారిని నిర్ణీత కంపార్ట్మెంట్ల వద్దే దించి.. తిరిగి అక్కడే ఎక్కించుకుని ఇళ్లకు తరలిస్తామని చెప్పిన ప్రభుత్వం.. కార్యక్రమం ముగిసిన తర్వాత పట్టించుకోలేదు. యోగాంధ్ర వేదికకు తరలించడానికి పెట్టిన శ్రద్ధ.. తిరిగి వారిని తీసుకెళ్లే విషయంపై పెట్టలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యోగాంధ్రకు వచ్చిన 3.03 లక్షలకు పైగా జనాలు కూటమి ప్రభుత్వంపై పెదవి విరిచారు.
టాయిలెట్ల కోసం అవస్థలు
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలను యోగాంధ్ర వేదికకు పెద్ద ఎత్తున తరలించారు. అర్ధరాత్రి 2 గంటలకే ప్రత్యేక బస్సుల్లో లక్షల మంది జనాలను నిర్ణీత కాంపార్ట్మెంట్ల వద్దకు తీసుకొచ్చారు. వీరిలో అత్యధిక శాతం మహిళలే ఉన్నారు. డ్వాక్రా మహిళలు తప్పనిసరిగా యోగాంధ్ర కార్యక్రమానికి హాజరుకావాలని హెచ్చరించడంతో మెజార్టీ మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో తరలివచ్చారు. అయితే ఉదయం కాలకృత్యాలు తీర్చుకోడానికి మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతి వంద మందికి ఒక టాయిలెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జోడుగుళ్లపాలెం నుంచి భీమిలి వరకు వేసిన కంపార్ట్మెంట్లకు దూరంగా టాయిలెట్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట ఏకంగా అర కిలోమీటరు దూరంగా బయో టాయిలెట్లను ఉంచారు. దీంతో కాంపార్ట్మెంట్ల నుంచి ప్రజలు అక్కడికి వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. అక్కడ కూడా పెద్ద క్యూలు ఉండడంతో ఎటు వెళ్లాలో తెలియక నరకయాతన అనుభవించారు. కొన్ని చోట్ల టాయిలెట్లకు వెళుతున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ బయో టాయిలెట్లను సైతం శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం భరించలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
మ్యాట్ల కోసం కొట్లాట
ఒకవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేస్తుంటే.. మరోవైపు యోగా మ్యాట్ల కోసం కొందరు ముష్టి యుద్ధాలు చేసుకున్నారు. స్నాక్ ప్యాకెట్ల కోసం దుస్తులు చింపుకున్నారు. ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకు యోగాసన కార్యక్రమం సజావుగా జరిగింది. ఎంవీపీ కాలనీ నుంచి భీమిలి వరకు, అలాగే పీఎం పాలెం, మిథిలాపురి వుడా కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో తోపులాటలు, కొట్లాటలు జరిగాయి. ఈ యోగాసనాలకు వచ్చే 5 లక్షల మందికి ఉచితంగా యోగా మ్యాట్లు, టీషర్ట్, స్నాక్స్, పళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సగం మందికి కూడా వీటిని అందించలేదు. వీఐపీలు, అధికారులు యోగాసనాలు వేసే ప్రాంతాల్లో మ్యాట్లు, స్నాక్ ప్యాకెట్లు కంపార్ట్మెంట్లలోనే అందుబాటులో ఉంచారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాటిని అందించలేదు. పీఎం పాలెం డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో వాటర్ బాటిళ్లు, యోగా మ్యాట్లు, స్నాక్స్ కోసం జనాలు ఎగబడ్డారు. ఈ క్రమంలో తోపులాటలు జరిగి కొట్లాటకు దిగారు. ఇందులో గాజువాకకు చెందిన కూటమి నాయకుడు కారులో వచ్చి పోలీసుల సాయంతో జనాన్ని పక్కకు నెట్టి స్నాక్స్, యోగా మ్యాట్ల బస్తాలను బలవంతంగా కారులో ఎక్కించుకుని ఉడాయించాడు. దీనిపై అక్కడున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తిమ్మాపురంలో స్నాక్ ప్యాకెట్ల కోసం, చేపలుప్పాడలో టీషార్టుల కోసం తోపులాటలు జరిగాయి.
కిలోమీటర్లు నడక
యోగాసనాలు ముగిసిన తర్వాత ప్రజలందరూ ఒకేసారి బయలుదేరారు. కాంపార్ట్మెంట్ల వద్ద దించిన బస్సులను ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంగా నిలిపారు. అవి బీచ్ రోడ్డులోకి వచ్చే పరిస్థితి లేదని, అందరూ ఆ బస్ పాయింట్ల వద్దకు రావాలని సూచించారు. దీంతో యోగాకు వచ్చిన వారు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి నిద్రలేక, కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం లేక విసిగెత్తిపోయారు. దీనికి తోడు కిలోమీటర్లు నడవాల్సి రావడంతో ప్రభుత్వంపై మండిపడ్డారు. బలవంతంగా తీసుకురావడమే కాకుండా అవస్థలకు గురిచేయడాన్ని తప్పుబట్టారు.
కాలకృత్యాల కోసం విద్యార్థుల పాట్లు
తెన్నేటి పార్కు వద్ద మ్యాట్ల కోసం తోపులాట

మ్యాట్ల కోసం కొట్లాట.. టాయిలెట్ల కోసం తోపులాట