
విశాఖ అభివృద్ధి నా బాధ్యత
● మెట్రో, ఫ్లైఓవర్ ప్రాజెక్టులు వేగవంతం చేస్తా.. ● పాతనగరం ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి ● జీవీఎంసీ నూతన కమిషనర్ కేతన్ గార్గ్
డాబాగార్డెన్స్: విశాఖ నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని జీవీఎంసీ నూతన కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘నగరంలో పారిశుధ్యం, సుందరీకరణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తా. పౌరులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పిస్తా. తాగునీరు, వీధి దీపాలు, కాలువలు, రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జీవీఎంసీకి అందే నిధులను సక్రమంగా వినియోగించి, విశాఖను మరింత అభివృద్ధి చేస్తా. ఇందుకోసం మేయర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుంటా. స్వచ్ఛ సర్వేక్షణ్లో విశాఖకు ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అందరి సహకారంతో కృషి చేస్తా. డీపీఆర్ ప్రకారం ప్రతిపాదించిన మెట్రో, ఫ్లైఓవర్ ప్రాజెక్టులకు జీవీఎంసీ తరఫున పూర్తి సహకారం అందిస్తా. ఆ పనులు వేగవంతమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటా..’ అని చెప్పారు. నగరంలోని ఖాళీ స్థలాలను సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తానని నూతన కమిషనర్ తెలిపారు. పార్కులు, కూడళ్లను అభివృద్ధి చేస్తానని చెప్పారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కాలువల్లోని పూడికను తొలగిస్తామన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులపై సర్వే నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. దక్షిణ నియోజకవర్గం పాతనగరంలో సమస్యలున్నాయని, వాటిని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రోడ్ల అభివృద్ధిపై సర్వే నిర్వహించి, అడ్డంకులుంటే న్యాయపరంగా వాటిని పరిష్కరిస్తామని, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. నగరంలోని సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పోలీస్ శాఖ, జీవీఎంసీ సమన్వయంతో నిర్వహిస్తామన్నారు. తీర నగరమైన విశాఖను ఇతర నగరాలతో ‘సిస్టర్ సిటీ’లుగా అనుసంధానించేందుకు ప్రయత్నిస్తామని, నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని కేతన్ గార్గ్ పేర్కొన్నారు.