
ఆరోగ్యవంతమైన సమాజంతో సుస్థిర అభివృద్ధి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజా
విశాఖ లీగల్: ఆరోగ్యవంతమైన సమాజంతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజా అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ, విశాఖ న్యాయవాదుల సంఘం సంయుక్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ, యోగ ధ్యానం తప్పనిసరి అని తెలిపారు. విశాఖలో తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినందుకు పలువురిని అభినందించి, భారత ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.