
కారాగారంలో వినూత్న యోగా
ఆరిలోవ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ కేంద్ర కారాగారంలో అధికారులు వినూత్నంగా నిర్వహించారు. జైలు లోపల 1000 మంది ఖైదీలతో కలిసి అధికారులు, సిబ్బంది నల్ల రంగు ప్యాంట్లు, పలు రంగుల టీషర్టులు ధరించి యోగాసనాలు వేశారు. రంగురంగుల యోగా మ్యాట్లపై భారతదేశం మ్యాప్ ఆకారంలో నిలబడి యోగా చేస్తూ స్వదేశంపై ఉన్న అభిమానం చాటుకున్నారు. దీంతో పాటు జైల్ ప్రధాన ద్వారం బయట గాంధీ విగ్రహం వద్ద సిబ్బందితో కలిసి అధికారులు వృత్తాకారంలో నిలబడి యోగాసనాలు వేశారు. క్రమశిక్షణతో యోగాసనాలు వేసిన ఖైదీలు, సిబ్బందిని జైల్ పర్యవేక్షణాధికారి ఎం.మహేష్బాబు అభినందించారు.