
హైవే జామ్
క్రికెట్ స్టేడియం వద్ద వాహనాల రద్దీ
స్తంభించిన ప్రజా రవాణా ● ప్రయాణికులకు నరకయాతన
ఎంవీపీకాలనీ: విశాఖపట్నం వేదికగా జరిగిన ‘యోగాంధ్ర’ కార్యక్రమం నగరవాసులకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రయాణికులకు తీవ్ర అవస్థలు మిగిల్చింది. కార్యక్రమం కోసం ప్రభుత్వం సుమారు 9,995 ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. శనివారం తెల్లవారుజాము నుంచే మద్దిలపాలెం, ఇసుకతోట, హనుమంతవాక, మధురవాడ, ఆనందపురం కూడళ్లలో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. గ్రామీణ నియోజకవర్గాల నుంచి వచ్చిన వాహనాలను తగరపువలస, ఆనందపురం, మధురువాడ, ఎండాడ, జూపార్క్ కూడళ్ల మీదగా బీచ్లోకి పంపించడంతో ఆయా కూడళ్లలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో యోగా కార్యక్రమానికి వెళ్లేవారితో పాటు, సాధారణ ప్రజలు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యోగాంధ్రకు వెళ్లే వారంతా ఆయా ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై దిగి బీచ్రోడ్డుకు నడుచుకుంటూ వెళ్లాల్సివచ్చింది. ఇక విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక, ప్రైవేటు వాహనాలు దొరక్క ద్వారకా, మద్దిలపాలెం బస్స్టేషన్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాశారు. ఇదే అదనుగా కొన్ని ఆటోలు, ప్రైవేటు వాహనాలు ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేసి వారిని మరింత ఇబ్బందికి గురిచేశాయి. మొత్తం మీద యోగాంధ్ర కార్యక్రమం నగరంలో ట్రాఫిక్ గందరగోళాన్ని, ప్రయాణికులకు నరకయాతనను మిగిల్చింది.

హైవే జామ్