
వైఎస్ జగన్పై టీడీపీ కుట్ర
● ఇందులో భాగంగానే గోరంట్ల వ్యాఖ్యలు ● ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్
మద్దిలపాలెం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని, ఆయనపై కుట్రలకు పాల్పడటమే ఏకై క అజెండాగా టీడీపీ పనిచేస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆరోపించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ తల నరుకుతామంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు అధికార మదంతో అన్నవి కావని.. అది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్న కుట్రలో భాగమేనని రాజు ఆరోపించారు. ‘పుష్ప–2’ సినిమా డైలాగ్తో ఫ్లెక్సీ వివాదాన్ని సృష్టించడం, ఆ వెంటనే గోరంట్ల చేత ఈ వ్యాఖ్యలు చేయించడం టీడీపీ, ఎల్లో మీడియా వేసిన పథకమని విమర్శించారు. బుచ్చయ్య చౌదరిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే..
ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ ఇలాంటి డైవర్షన్, క్రిమినల్ రాజకీయాలకు పాల్పడుతోందని రాజు ఆరోపించారు. ‘ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తా, రెడ్ బుక్ అంటూ చంద్రబాబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముందు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు?’ అని ప్రశ్నించారు. ఏడాదిలోనే ఒక ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడం.. దేశ చరిత్రలోనే కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. సూపర్ సిక్స్, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆడబిడ్డ నిధి, ఉచిత పంటల బీమా వంటి హామీలను గాలికొదిలేశారని విమర్శించారు.
దిగజారిన శాంతిభద్రతలు
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియాలు పెచ్చుమీరాయని కె.కె.రాజు ఆరోపించారు. 390 మంది హత్యకు గురయ్యారని, 376 మందిపై హత్యాయత్నాలు జరిగాయన్నారు. 203 మంది చిన్నారులపై దాడులు, లైంగిక దాడులు జరిగాయన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 కేసులు పెట్టారని, సోషల్ మీడియా కార్యకర్తలపై 729 అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. ఏడాది కాలంలోనే రూ.1.61 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. తమ ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులో ఇది 48.5 శాతం అని గుర్తుచేశారు. రాష్ట్ర ఆదాయం పెరగకపోగా, 0.44 శాతం తగ్గిందని, ఆ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందో చెప్పాలని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే జగన్కు భద్రత తగ్గించి, ఆయన పర్యటనల్లో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాభిమానం ఉన్నంత వరకు ఎలాంటి కుట్రలు పన్నినా జగన్ను ఏమీ చేయలేరని కె.కె.రాజు స్పష్టం చేశారు.