
బదిలీల రగడ
రోడ్డెక్కిన హెడ్నర్సులు ●
● వైద్య ఆరోగ్య శాఖలో పైరవీల పర్వం ● నిబంధనలకు పాతరేస్తూ బదిలీలు ● 58 ఏళ్ల వయసున్న వారికి ఏజెన్సీలో పోస్టింగ్ ● అన్యాయమంటున్న నర్సులు
మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖలో పలు కేటగిరీల ఉద్యోగుల బదిలీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, ఆంధ్రా మెడికల్ కాలేజీల్లో పలు కేటగిరీల్లో రెండు రోజుల కిందట ప్రారంభమైన బదిలీల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ముఖ్యంగా నర్సులు, ఏఎన్ఎంలు, సీనియర్ అసిస్టెంట్ల బదిలీల్లో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కొంతమందికి మేలు చేసే ఉద్దేశంతో అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను బుట్టదాఖలు చేసి, ఏకపక్షంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. పేరుకు నిబంధనలు ఉన్నప్పటికీ.. వాటిలో ఒక్కటి కూడా బదిలీ ప్రక్రియలో అమలు చేయలేదని, భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని కావాల్సిన వారికి కావాల్సిన చోట పోస్టింగ్లు ఇచ్చారని సమాచారం.
అవినీతి కేసులో ఉన్నవారికి అందలం
సీనియర్ అసిస్టెంట్ బదిలీల్లో భాగంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసులో పట్టుబడిన ఉద్యోగికి కీలకమైన పోస్టింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. గతంలో ఆర్డీ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఏసీబీకి పట్టుబడిన ఆ ఉద్యోగికి ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో పోస్టింగ్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఏసీబీ కేసుల్లో చిక్కుకున్న వారికి ప్రాధాన్యం లేని(లూప్లైన్) పోస్టింగ్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ నగర పరిధిలోనే పోస్టింగ్ ఇవ్వడం వెనుక కూటమి ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అదేవిధంగా ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అనకాపల్లి డీఎంహెచ్వో కార్యాలయంలో పోస్టింగ్ కేటాయించారు. మార్గదర్శకాల ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. వైద్య ఆరోగ్య శాఖలో మొదటి నుంచి అన్నీ తేడా వ్యవహారాలే కాబట్టి.. అధికారులు చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు వస్తున్నాయి.
బదిలీల్లో కొరవడిన పారదర్శకత
హెడ్నర్సుల బదిలీల కౌన్సెలింగ్లో పారదర్శకత లోపించిందని పలు ప్రభుత్వ ఆసుపత్రుల హెడ్నర్సులు కేజీహెచ్ వద్ద గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. వెంటనే కౌన్సెలింగ్ను రీకాల్ చేసి ఆఫ్లైన్లో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు హెడ్ నర్సులు మాట్లాడారు. ‘ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 ఏళ్లు దాటిన ఉద్యోగులను ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేయకూడదు. కానీ 58 ఏళ్లు దాటిన సుమారు 55 మంది మహిళలను విశాఖపట్నం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమలో చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, పదవీ విరమణకు కూడా తక్కువ సమయం ఉందని, అయినప్పటికీ తమ విజ్ఞప్తిని అధికారులు పరిగణలోకి తీసుకోలేదని వాపోయారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ అధికారి ఏకపక్షంగా ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించారని, కౌన్సెలింగ్ సమయంలో తమ అభిప్రాయాలు చెప్పకుండా కంప్యూటర్ను మ్యూట్ చేశారని ఆరోపించారు. తమకు నచ్చినట్టే బదిలీలు చేస్తామని, వెంటనే ఆమోదపత్రాలు తీసుకోవాలని తమపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. అలాగే పైఅధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి తక్కువ వయసు ఉన్నవారికి నచ్చిన ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇచ్చారని విమర్శించారు. స్థానికులను కాదని, బయట నుంచి వచ్చిన వారికి నగరంలో ప్రాధాన్యమిచ్చారన్నారు. ఈ వయసులో ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ అయితే ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన చెందారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి డ్యూటీలు వేసినప్పటికీ, వెంటనే బదిలీ అయిన స్థానాల్లో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. జరిగిన కౌన్సెలింగ్ను రద్దు చేసి, ఆఫ్లైన్లో తిరిగి నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.