
ఆర్టీసీ ప్రయాణికులకు అవస్థలు
డాబాగార్డెన్స్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించే ఏ కార్యక్రమానికై నా విశాఖ నుంచి ఆర్టీసీ బస్సులను తరలించడం పరిపాటిగా మారింది. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న, ప్రధాని మోదీ హాజరయ్యే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరెన్ని బస్సుల్ని తరలిస్తారో.. చెప్పక్కర్లేదు. అసలే అరకొర ఆర్టీసీ బస్సులతో నడుస్తున్న విశాఖలో.. ఇలాంటి సమయంలో ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీతం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.
విశాఖ రీజియన్ నుంచి 550 బస్సులు
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనికి ప్రధానితోపాటు, దేశ విదేశాల ప్రముఖులు రానుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసమీకరణకు శ్రీకారం చుట్టారు. దాదాపు 5 లక్షల మందిని సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు విశాఖ రీజియన్ నుంచి 550 ఆర్టీసీ బస్సుల్ని కేటాయించారు. రాష్ట్రం నలు మూలల నుంచి జనసమీకరణకు 3,200 ఆర్టీసీ బస్సులను వినియోగిస్తుండటం గమనార్హం. సిటీ పరిధిలో ఆశించిన మేర సిటీ సర్వీసులు లేవు. దీంతో గురువారం సాయంత్రం నుంచే విద్యార్థులు, సాధారణ ప్రయాణికులకు తిప్పలు మొదలయ్యాయి.