
యోగాంధ్రకు తరలిరండి
రాష్ట్ర మంత్రుల పిలుపు
ఏయూక్యాంపస్: యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆయుష్ శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏయూ కన్వెన్షన్ కేంద్రం నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు గురువారం వాక్థాన్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, సవితలతో కలిసి ఆయన ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. ఆయుష్ కార్యదర్శి రాజేష్ కొట్పా మాట్లాడుతూ యోగాంధ్రలో ప్రజలంతా భాగం కావాలన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు మాట్లాడుతూ యోగాంధ్ర విజయంతో ప్రపంచానికి మంచి సందేశం అందించాలని కోరారు. యోగాపై వివిధ పోటీలు నిర్వహించి 25 లక్షల మందికి సర్టిఫికెట్లు ప్రదానం చేసినట్లు వెల్లడించారు. వీరంతా ప్రధాన వేదికలో యోగాసనాలు వేస్తారన్నారు. అనంతరం అధికారులు విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద యోగాసనాలు వేశారు. యోగా అభ్యాసకులకు అధికారుల చేతులమీదుగా టీషర్ట్స్ అందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు, మేయర్ పీలా శ్రీనివాసరావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, వీరపాండ్యన్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నరసింహారెడ్డి, పరశురామ్ రాజు, మాజీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.