
లాసెట్లో 2,4 ర్యాంకులు మనవే..
ఎంవీపీకాలనీ/కంచరపాలెం : లాసెట్ 2025 ఫలితాల్లో విశాఖపట్నం విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముదునూరి రామ్ తేజ్ వర్మ రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించగా, గొర్లె శ్రావ్య నాలుగో ర్యాంకుతో సత్తా చాటారు.
రాష్ట్రస్థాయిలో రామ్ తేజ్ వర్మకు రెండో ర్యాంకు,
శ్రావ్యకు నాల్గవ ర్యాంకు
జూనియర్ సివిల్ జడ్జి అవుతా
తాటిచెట్లపాలెం, కై లాసపురానికి చెందిన గొర్లె శ్రావ్య లాసెట్ 2025 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించారు. గురువారం విడుదలైన ఫలితాల్లో శ్రావ్య 107 మార్కులతో నాలుగో స్థానంలో నిలిచారు. జూలై 13న జరగనున్న జేసీజే (జూనియర్ సివిల్ జడ్జి) ఎంట్రన్స్ పరీక్ష రాసి జూనియర్ సివిల్ జడ్జి కావాలనే లక్ష్యంతో ఆమె శ్రమిస్తున్నారు. శ్రావ్య తండ్రి గొర్లె చంద్రరావు విశాఖ పోర్ట్ ట్రస్ట్లో పనిచేస్తూ.. నేషనల్ పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ యూనియన్కు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శ్రావ్య అక్క గొర్లె సింధు క్యాట్ రాసి ఐఐఎం ఉదయపూర్లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని జేపీ మోర్గాన్లో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి గొర్లె పార్వతి గృహిణిగా ఉంటూ, పిల్లల ఉన్నత చదువులను దగ్గరుండి చూసుకుంటున్నారు. లాసెట్లో ర్యాంకు సాధించిన శ్రావ్యను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అభినందించారు.
లక్ష్యం ప్రొఫెషనల్ కెరీర్
నగరంలోని లాసన్స్ బే కాలనీకి చెందిన ముదునూరి రామ్ తేజ్ వర్మ లాసెట్–2025లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించి ప్రతిభ చూపాడు. ప్రొఫెషనల్ ఉద్యోగం చేయాలనే లక్ష్యంతోనే తాను లాసెట్ రాసినట్లు రామ్ తేజ్ వర్మ తెలిపారు. అతని తండ్రి ముదునూరి విజయ్కుమార్ రాజు నెడ్క్యాప్ జిల్లా మేనేజర్గా విధులు నిర్వర్తించి ఇటీవలే పదవీ విరమణ చేశారు. తల్లి ధనలక్ష్మి గృహిణి. రామ్ తేజ్ వర్మ 2013లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంటెక్ సివిల్ ఇంజినీరింగ్ (స్ట్రక్చరల్ ఇంజినీరింగ్) పూర్తి చేశారు. అనంతరం రెండేళ్లు సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. హైదరాబాద్లోని గురునానక్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. మూడున్నరేళ్లపాటు తిరుపతిలోని కేఎస్ఆర్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు సివిల్స్ కోచింగ్ ఇచ్చారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత విద్యతో పాటు ప్రొఫెషనల్ కెరీర్ కూడా ఉండాలన్న అభిప్రాయంతోనే లాసెట్ పరీక్షకు సిద్ధమయ్యానని రామ్ తేజ్ వర్మ వివరించారు. ఈ విషయంలో హైకోర్టు న్యాయవాది, తన పిన్ని శ్రీదేవి తనకు ప్రోత్సాహం అందించారని పేర్కొన్నారు. లాసెట్లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని, న్యాయవాదిగా సేవలు అందించాలన్న తన లక్ష్యానికి ఈ ర్యాంకు స్ఫూర్తినిచ్చిందన్నారు. ఈ ర్యాంకు ద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో లా కోర్సులో చేరతానని తెలిపారు. అయితే ఎన్క్యాట్ (జాతీయ స్థాయి లా ఎంట్రన్స్ టెస్ట్) కూడా రాస్తానని చెప్పారు. అందులో మంచి ర్యాంకు వస్తే హైదరాబాద్ నల్సార్ లా కళాశాల లేదా బెంగళూరులోని నేషనల్ లా కళాశాలలో న్యాయ విద్యను అభ్యసిస్తానని రామ్ తేజ్ వర్మ పేర్కొన్నారు.

లాసెట్లో 2,4 ర్యాంకులు మనవే..