
కడుపుకొట్టిన యోగాంధ్ర
కొమ్మాది: బీచ్రోడ్డు జరగనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమం స్థానిక మత్స్యకారులు, చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ప్రపంచ రికార్డు లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
రెండు రోజుల పాటు వేట నిషేధం
ఈ నెల 20, 21 తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే 60 రోజుల వేట విరామం తర్వాత జూన్ 15న తిరిగి వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఇది మరో దెబ్బ. జిల్లాలోని సుమారు 25 వేల మత్స్యకార కుటుంబాలు(లక్షన్నర మంది ప్రత్యక్షంగా, మరో లక్ష మంది పరోక్షంగా) దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ‘ఇప్పటికే పస్తులున్న మాకు ఇది చాలా కష్టం. ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలి’ అని రాంబాబు అనే మత్స్యకారుడు కోరారు.
చిరు వ్యాపారుల బడ్డీల తొలగింపు: మంగమారిపేట, రామాద్రి తీర ప్రాంతాల్లో దాదాపు 30 దుకాణాలను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించారు. దీంతో ఈ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తమ సరకులు పాడవుతున్నాయని, ప్రత్యామ్నాయం చూపకుండా బడ్డీలు తొలగించడంపై అమర్నాథ్ అనే చిరు వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటో డ్రైవర్లకు ఇక్కట్లు
బీచ్ రోడ్డులో బారికేడ్లు వేసి మూసివేయడంతో గత మూడు రోజులుగా ఆటో డ్రైవర్లు పనిలేక ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఫైనాన్స్ కట్టలేకపోతున్నామని శివ అనే ఆటో డ్రైవర్ వాపోయారు. యోగాంధ్ర ఏర్పాట్లు వందలాది మంది ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశాయని ఆయన పేర్కొన్నారు.
ఇంటికే పరిమితమైన మత్స్యకారులు, చిరువ్యాపారులు
అసహనం వ్యక్తం చేస్తున్న ఆటోడ్రైవర్లు