నృత్య కళ.. ప్రతిభ భళా | - | Sakshi
Sakshi News home page

నృత్య కళ.. ప్రతిభ భళా

Jun 19 2025 3:51 AM | Updated on Jun 19 2025 3:51 AM

నృత్య

నృత్య కళ.. ప్రతిభ భళా

● కూచిపూడి మణిదీపిక లిఖితసాయి ● పలు రాష్ట్రాల్లో 200 వరకు ప్రదర్శనలు ● 15 ఏళ్లుగా నృత్యకళాకారిణిగా రాణింపు

తగరపువలస : నాట్యకళకు నిలయమైన కూచిపూడి సంప్రదాయంలో చిలుకోటి వెంకట లిఖితసాయి తనదైన ముద్ర వేసుకుంటోంది. గత 15 సంవత్సరాలుగా కూచిపూడి నాట్యసీమలో అప్రతిహతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ యువ కళాకారిణి, తెలు గు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్‌ వంటి ఇతర రాష్ట్రాలలో 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చి కళాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. అడుగడుగునా తన ప్రతిభతో ఆకట్టుకుంటూ, కూచిపూడి కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తోంది.

జీవీఎంసీ భీమిలి జోన్‌ ఒకటో వార్డు చిట్టివలసకు చెందిన 22 ఏళ్ల బీటెక్‌ విద్యార్థిని చిలుకోటి వెంకట లిఖితసాయి కూచిపూడి నృత్యంలో విశేషంగా రాణిస్తోంది. పద్మావతి పరిణయం నృత్యరూపకాన్ని ఇప్పటివరకు 30 సార్లు ప్రదర్శించగా, అందులో 5 సార్లు శ్రీవారి సన్నిధిలో ప్రదర్శించడం తనకు మరచిపోలేని దివ్యానుభూతిని కలిగించిందని లిఖితసాయి తెలిపింది. కూచిపూడితో పాటు, ఫోక్‌ డాన్స్‌లలోనూ తన తోటి విద్యార్థినులతో కలిసి తన సత్తా చాటింది.

విద్యలోనూ ముందంజ

భీమిలి ఐ.ఎన్‌.ఎస్‌. కళింగ కేంద్రీయ విద్యాలయంలో 10+2 పూర్తి చేసిన లిఖితసాయి, ఇటీవల భీమిలి మండలంలోని లెండి కళాశాలలో ఈ.సి.ఈ. విభాగంలో బీటెక్‌ పూర్తి చేసింది. క్యాంపస్‌ డ్రైవ్‌లో మూడు ఉద్యోగావకాశాలు సాధించినప్పటికీ, తన సోదరుడు వెంకట దినేష్‌ కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడంతో, ఆమె ప్రస్తుతం గేట్‌ పరీక్ష రాయడానికి సిద్ధమవుతోంది.

గురువుల ప్రోత్సాహం, అవార్డులు

ఏడేళ్ల వయసులో తగరపువలసలో నాట్యరవళి డ్యాన్స్‌ అకాడమీకి చెందిన ఉమ్మిడి మహేష్‌బాబు వద్ద శిష్యరికం ప్రారంభించిన లిఖితసాయి, అంచలంచెలుగా ఎదిగి పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరుకుంది. లాక్‌డౌన్‌ సమయంలో చైన్నెకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి హరిణి జీవిత తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిందని లిఖితసాయి చెప్పుకొచ్చింది.

23న సత్కారం

కళారంగ సేవలకు గుర్తింపుగా ఈ నెల 23న ఇందు 5 స్టార్‌ అసోసియేషన్‌ లిఖితసాయిని విశాఖ లైబ్రరీలో ఘనంగా సత్కరించనుంది. ఇప్పటికే ఆమెకు 2022లో క్లాసికల్‌ డ్యాన్స్‌కు సంబంధించి యూత్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ వారి ఎఫ్‌.ఎఫ్‌.ఎ. ఉగాది పురస్కారం, 2021లో ఆల్‌ ఇండియా డాన్స్‌ ఫెస్టివల్‌లో భాగంగా నాట్య అభినయ అవార్డు, 2023–24లో జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా యూత్‌ ఫెస్టివల్‌లో మొదటి బహుమతి లభించాయి. ప్రస్తుతం కూచిపూడిలో సర్టిఫికెట్‌ ఎగ్జామ్‌ రాస్తున్న లిఖితసాయి, డిప్లమో, ఎం.ఎ. కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది.

తల్లే తొలిగురువు..

కూచిపూడి నృత్యంలో ప్రతిభ చూపుతున్న చిలుకోటి వెంకట లిఖితసాయి విజయం వెనుక ఆమె తల్లి వెంకటరత్నం ప్రోత్సాహం ఎంతో ఉంది. తాను పూర్తిస్థాయిలో నృత్యం నేర్చుకోలేకపోయాననే ఆవేదనను తన కుమార్తె ద్వారా తీర్చుకుంటున్నారు వెంకటరత్నం. లిఖితసాయి ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా, ఆమె వెంట ఉండి చీర కట్టడం, జడ అల్లడం వంటి పనులను స్వయంగా చూసుకుంటారు. కుమార్తె కళా ప్రదర్శనలకు తల్లిదండ్రులు ఎంతగానో ప్రాధాన్యతనిస్తున్నారు. లిఖితసాయి చదువుకు ప్రాధాన్యత ఇస్తూనే, ఆమెకు ఇష్టమైన కళారంగంలో పూర్తి మద్దతు అందిస్తున్నారు. వారి ప్రోత్సాహంతోనే లిఖితసాయి నృత్య రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు.

నృత్య కళ.. ప్రతిభ భళా1
1/4

నృత్య కళ.. ప్రతిభ భళా

నృత్య కళ.. ప్రతిభ భళా2
2/4

నృత్య కళ.. ప్రతిభ భళా

నృత్య కళ.. ప్రతిభ భళా3
3/4

నృత్య కళ.. ప్రతిభ భళా

నృత్య కళ.. ప్రతిభ భళా4
4/4

నృత్య కళ.. ప్రతిభ భళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement