
యోగాంధ్రకు ముమ్మర ఏర్పాట్లు
ఏయూక్యాంపస్: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ పాల్గొననున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం ఆర్.కె.బీచ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన వేదిక ఏర్పాట్లు ప్రణాళికతో చేపడుతున్నారు. అదే సమయంలో రహదారి ఇరువైపులా బారికేట్ల నిర్మాణం పూర్తికావచ్చింది. తీరం వెంబడి ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విద్యుత్ దీపాల ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యంగా భద్రత, సుందరీకరణ, ప్రజా సౌకర్యాల కల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు.
సాగర తీరానికి హరిత శోభ
బీచ్ రోడ్డుకు కొత్త అందాలు అద్దేందుకు హార్టికల్చర్ విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు డివైడర్లపై తాత్కాలిక కుండీలలో ఆరు నుంచి ఎనిమిది అడుగుల పొడవైన పామ్ జాతి మొక్కలను ఏర్పాటు చేశారు. తీరంలోని మహనీయుల విగ్రహాల వద్ద, ఇతర కీలక ప్రాంతాలలో పచ్చని గడ్డితో లాన్లను సిద్ధం చేస్తున్నారు. ఆరిలోవలోని ప్రభుత్వ నర్సరీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వివిధ రకాల మొక్కలతో బీచ్ రోడ్డును హరితమయం చేస్తున్నారు.
భద్రతా వలయంలో బీచ్ రోడ్
ప్రధాని పర్యటన దృష్ట్యా నగరం, ముఖ్యంగా సాగర తీరం పటిష్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. రెండు రోజులుగా పోలీసులు తీరం వెంబడి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. నగరానికి చేరుకున్న అదనపు పోలీసు బలగాలకు వివిధ ప్రాంతాలలో వసతి కల్పించి, విధులను కేటాయిస్తున్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్, సాగరికలలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ల వద్ద వందలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారు. బీచ్రోడ్డులోని పోలీస్ మెస్లో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.
ప్రజల వీక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు,
ట్రాఫిక్ ఆంక్షలు : ప్రధాన వేదిక వద్ద జరిగే కార్యక్రమాన్ని, ప్రధాని ప్రసంగాన్ని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా బీచ్ రోడ్డులో పలుచోట్ల భారీ ఎల్ఈడీ తెరలు, సౌండ్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. భద్రత ఏర్పాట్ల దృష్ట్యా ట్రాఫిక్ను కఠినంగా నియంత్రిస్తున్నారు. ఆర్కే బీచ్ నుంచి పాండురంగాపురం వరకు వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. వీఎంఆర్డీఏ పార్క్ నుంచి వాల్తేర్ డిపో వరకు కూడా వాహనాల రాకపోకలు నిషేధించారు. ప్రస్తుతం పాండురంగాపురం నుంచి పార్క్ హోటల్ కూడలి వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంది. నిషేధిత ప్రాంతాల్లో గ్రీన్ మ్యాట్లు పరచడం, కంపార్ట్మెంట్ల నిర్మాణం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి.
భద్రత, సుందరీకరణ, ప్రజలకు
సౌకర్యాలపై అధికారుల దృష్టి

యోగాంధ్రకు ముమ్మర ఏర్పాట్లు