
కుటుంబమంతా ఉద్యమ బాటే!
పెందుర్తి: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన అరుణక్క కుటుంబమంతా ఉద్యమానికి దగ్గరగా ఉంది. ఆమె స్వస్థలం పెందుర్తి కరకవానిపాలెం. తల్లిదండ్రులు వి.లక్ష్మణరావు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి శాంతి అలియాస్ అర్జునమ్మ గృహిణి. వీరికి వెంకటరవి లక్ష్మి చైతన్య అలియాస్ అరుణక్క, గోపి అలియాస్ ఆజాద్, ఝాన్సీ సంతానం. చిన్ననాటి నుంచి వామపక్ష భావజాలం కలిగిన అరుణక్క దాదాపు మూడు దశాబ్దాల క్రితమే ఉద్యమంలోకి వెళ్లిపోయింది. అనేక పోరాటాల్లో కీలకంగా వ్యవహరించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ప్రస్తుతం పనిచేస్తోంది. ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందడంతో కరకవానిపాలెంలోని కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. అరుణక్క సోదరుడు గోపీ అలియాస్ ఆజాద్ కూడా యుక్త వయసులోనే ఉద్యమం వైపు అడుగులు వేశాడు. ఉద్యమంలో చేరిన కొంతకాలానికే గాలికొండ ఏరియా దళ కమాండర్ హోదా దక్కింది. అయితే అదే సమయంలో ఆజాద్ 2016లో గూడెంకొత్తవీధి అటవీ ప్రాంతం మర్రిపాకల వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. అరుణక్క సోదరి ఝాన్సీ న్యాయవాది. ప్రజా ఉద్యమంలో చురుగ్గా ఉంటారు. గంగవరం పోర్టు నిర్మాణ వ్యవహారంలో మత్స్యకారులకు, యాజమాన్యానికి మధ్య జరిగిన పోరాటంలో ఝాన్సీ మత్స్యకారులకు అండగా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఆమె పోరాటంలో భాగంగా గాయపడితే కేజీహెచ్కు తరలించారు. ఆ సమయంలో కేజీహెచ్ బెడ్ మీద ఆమెకు సంకెళ్లు వేసి చికిత్స చేయడం పెద్ద సంచలనంగా మారింది.
నా కుమార్తెను ప్రభుత్వమే చంపింది:
లక్ష్మణరావు, అరుణక్క తండ్రి
మారేడుమిల్లిలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్. నా కుమార్తె(అరుణక్క)ను పోలీసులు కొద్ది రోజుల క్రితమే పట్టుకుని బంధించి ఇప్పుడు హతమార్చారు. దీన్ని ప్రభుత్వ హత్యగానే బావిస్తున్నాం. గతంలో కూడా నా కుమారుడు గోపీ అలియాస్ ఆజాద్ను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. దీనిపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం.
పదేళ్ల క్రితం ఎన్కౌంటర్లో మృతి చెందిన అరుణక్క సోదరుడు ఆజాద్
ప్రజాక్షేత్రంలో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సోదరి ఝాన్సీ