
యువతనూ వెంటాడుతున్న మోకాళ్ల అరుగుదల
మహారాణిపేట: జీవనశైలి లోపాలు, ఊబకాయం, అధిక శరీర బరువు, రోడ్డు ప్రమాదాలు, క్రీడల్లో జరిగే ప్రమాదాల కారణంగా చిన్న వయసు వారిలోనూ మోకాళ్ల అరుగుదల ఎక్కువగా కనిపిస్తోందని వైజాగ్ ఆర్థ్రోస్కోపిక్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ గొల్లంగి శ్రీనివాస్, డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి తెలిపారు. సాధారణంగా 60–70 ఏళ్లు దాటిన తర్వాత కనిపించే ఈ సమస్య, పలు కారణాల వల్ల ప్రస్తుతం 20–40 మధ్య వయసు వారిలో కూడా అధికంగా కనిపిస్తోందన్నారు. నగరంలోని ఓ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మోకాలిలో ఉండే లిగమెంట్లు, మినిస్కస్ గాయాలైనప్పుడు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు. లేని పక్షంలో దీర్ఘకాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ఈ తరహా గాయాలను ఆర్థ్రోస్కోపీ ద్వారా నయం చేయవచ్చని, అందులోనూ అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. విశాఖపట్నంలోని కిమ్స్ ఆస్పత్రి (సీతమ్మధార) ఆధ్వర్యంలో నార్త్ ఆంధ్ర ఆర్థోపెడిక్ అసోసియేషన్, వైజాగ్ ఆర్థ్రోస్కోపిక్ అసోసియేషన్ సహకారంతో ఆర్థ్రోస్కోపీ శస్త్రచికిత్సల్లో వస్తున్న అత్యాధునిక విధానాలపై సదస్సు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 150 మందికిపైగా ఆర్థోపెడిక్ వైద్యులు హాజరయ్యారు. అహ్మదాబాద్లోని అడ్వాన్స్ ఆస్పత్రి డైరెక్టర్ ప్రతీమేష్ జైన్, అహ్మదాబాద్కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రోహన్ వక్త, కోయంబత్తూరులోని ఆర్థోవన్ ఆస్పత్రికి చెందిన వైద్యనిపుణుడు డాక్టర్ సంతోష్ సహానంద్ తదితరులు మోకాలికి సంబంధించిన వివిధ రకాల సమస్యలు, వాటిని నివారించే మార్గాలు, పరిష్కార సాంకేతికతల గురించి వివరించారు. ప్రతి ఒక్కరికీ తగిన శారీరక వ్యాయామం అవసరమని, రోజుకు కనీసం 3 నుంచి 5 కిలోమీటర్లు నడవడం ద్వారా చాలా వరకు సమస్యలను నివారించవచ్చని వైద్యులు సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్ సంతోష్ ఆర్. గడ్డం తదితరులు పాల్గొన్నారు.