
వలస నేతకు అందలమా?
● టీడీపీలో అసమ్మతి జ్వాలలు ● 8వ వార్డులో బయటపడ్డ విభేదాలు ● మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమన్న కార్యకర్తలు
కొమ్మాది: వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్ లొడగల అప్పారావుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై 8వ వార్డు టీడీపీలో తీవ్ర దుమారం రేగింది. పార్టీ అధికారంలో లేనప్పుడు ఐదేళ్లుగా కష్టపడి పని చేసిన తమను కాదని.. కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఎండాడలో జరిగిన కూటమి ఏడాది పాలన సంబరాల్లో పార్టీలో ఈ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వివరాల్లోకి వెళితే.. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా 8వ వార్డు ఎండాడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ ఎస్సీ విభాగం యువ నాయకుడు బెల్లాన శ్రీనివాస్ తన ఆవేదనను బహిరంగంగా వెళ్లగక్కారు. ‘ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ధర్నాలు, ఆందోళనలు చేసి జైలుకు కూడా వెళ్లాం. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక కార్పొరేటర్ లొడగల అప్పారావుకు ప్రాధాన్యమిస్తూ.. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దీనిని బట్టి చూస్తే పార్టీలో కష్టపడే వారికి విలువ లేదని స్పష్టమవుతోంది.’అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఐదేళ్లుగా వార్డు అధ్యక్షుడిగా పార్టీకి అనేక సేవలు అందించిన చెట్టిపిల్లి గోపిని ఆ పదవి నుంచి తొలగిస్తున్నారని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదని శ్రీనివాస్ అన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిసేందుకు వెళ్తే ఆయన ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు. ఒక వేళ వార్డు అధ్యక్షుడిని మారిస్తే మాత్రం మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కాగా.. ఏడాది పాలన సంబరాలను సైతం ఎండాడలో ఒక వర్గం, సాగర్నగర్లో మరో వర్గం వేర్వేరుగా నిర్వహించడం గమనార్హం. ఈ కార్యక్రమాలకు బీజేపీ, జనసేన స్థానిక నాయకులు హాజరుకాలేదు.