
కాలానుగుణ మార్పుల అధ్యయనంతోనే రాణింపు
సబ్బవరం: న్యాయ విద్యార్థులు కాలానుగుణంగా వస్తున్న మార్పులను అధ్యయనం చేస్తూ, విశ్వవిద్యాలయ వనరులను వినియోగించుకుని వృత్తిలో రాణించాలని హైకోర్టు న్యాయమూర్తి వీఆర్కే కృపాసాగర్ అన్నారు. స్థానిక దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్ఎన్ఎల్యూ)లో బుధవారం నిర్వహించిన ‘న్యాయ విద్య–న్యాయవాద వృత్తి’సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. వర్సిటీలో విద్యాభ్యాసం పూర్తిచేసుకుని బయట ప్రపంచంలో అడుగుపెట్టిన తరువాత పట్టించుకునేవారెవరూ ఉండరని, మనకు మనమే ఎదగాలన్నారు. అందుకే విశ్వవిద్యాలయంలోని వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని కాలాన్ని వృథా చేసుకోకుండా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. మిత్రులతో సబ్జెక్టు అంశాలపై చర్చిస్తూ, అధ్యాపకులతో సందేహ నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మన దగ్గరకు వచ్చే ప్రతి కేసును అంగీకరించి, వాదించే నైపుణ్యం కలిగి ఉండాలని సూచించారు. వర్సిటీలో బోధిస్తున్న సబ్జెక్టులతో పాటు దేశంలోని అన్ని హైకోర్టులు, సుప్రీం కోర్టుల్లో వెలువడే తీర్పులను అధ్యయనం చేస్తూ, అవగాహన పెంచుకున్నప్పుడే వృత్తిలో రాణించగలరన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి.సూర్యప్రకాశరావు, రిజిస్ట్రార్ డాక్టర్ విశ్వచంద్రనాఽథ్ మదాసు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
డీఎస్ఎన్ఎల్యూ విద్యార్థులతో హైకోర్టు న్యాయమూర్తి వీఆర్కే కృపాసాగర్