విశాఖ సిద్ధం | - | Sakshi
Sakshi News home page

విశాఖ సిద్ధం

Jun 21 2025 2:54 AM | Updated on Jun 21 2025 2:54 AM

విశాఖ

విశాఖ సిద్ధం

నేడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
గిన్నిస్‌ రికార్డు లక్ష్యంగా 5 లక్షల మందితో యోగాసనాలు హాజరుకానున్న ప్రధాని మోదీ, సీఎం, ఇతర ప్రముఖులు 18 క్రీడా మైదానాల్లో ప్రదర్శనలు.. బీచ్‌ రోడ్డులో 326 కంపార్ట్‌మెంట్లు ఉదయం 6.30 నుంచి 7.50 వరకు కార్యక్రమం భారీగా భద్రతా చర్యలు

11 వేల మంది నేవీ సిబ్బంది

యోగాంధ్ర కార్యక్రమంలో తూర్పు నావికాదళం భాగస్వామ్యమవుతోంది. ఆర్‌కే బీచ్‌ సముద్ర తీరంలో 11 నావికాదళం, కోస్ట్‌గార్డు నౌకలలో నేవీ అధికారులు యోగాసనాలు వేయనున్నారు. అలాగే, ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి మధ్యలో 10 కంపార్ట్‌మెంట్లలో 11 వేల మంది నేవీ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు యోగాభ్యాసన చేస్తారు.

విశాఖ సిటీ: అపూర్వ స్థాయిలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సిద్ధమైంది. ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవునా, 5 లక్షల మందితో యోగా ప్రదర్శన నిర్వహించి రికార్డు సృష్టించాలని జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నగరంలోని 18 క్రీడా మైదానాల్లోనూ యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. కార్యక్రమం శనివారం ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై ఉదయం 7:50 గంటలకు ముగుస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు, తూర్పు నావికాదళ అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొంటారు.

26 కిలోమీటర్ల బీచ్‌ రోడ్డు పొడవునా భారీ సంఖ్యలో పాల్గొనేవారి కోసం కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు మొత్తం 326 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌కు ఒక గెజిటెడ్‌ అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఒక్కో కంపార్ట్‌మెం ట్‌లో యోగా శిక్షకులు, ముగ్గురు ప్రదర్శకులు, పది మంది వలంటీర్లు, ఒక ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌, ఒక పోలీసు అధికారి, గిన్నిస్‌ రికార్డు నమోదు కోసం పది మంది ప్రతినిధులు (మొత్తం 4,600 మంది ప్రతినిధులు), ఒక ఫుడ్‌ ఇన్‌చార్జి, ఇద్దరు సూపర్‌వైజర్లు, పారిశుధ్య పర్యవేక్షకులు, నలుగురు పారిశుధ్య కార్మికులు ఉంటారు.

ఉత్తరాంధ్ర నుంచి 9,995 వాహనాలు

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలను తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మొత్తం 9,995 వాహనాలను వినియోగిస్తున్నారు. వీటిలో 7,295 బస్సులు, 2,500 ఆటోలు, 200 మేక్సీ క్యాబ్‌లు ఉన్నాయి. మొత్తం 75 పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయమే నిర్ణీత ప్రాంతాలకు బస్సులను పంపించారు. అల్లూరి జిల్లా నుంచి శుక్రవారం ఉదయం నుంచే తరలింపు ప్రక్రియ చేపట్టగా, మిగిలిన జిల్లాల నుంచి అర్ధరాత్రి వాహనాల్లో బీచ్‌ రోడ్డుకు తరలించారు. ప్రజలను ఏ కంపార్ట్‌మెంట్‌ వద్ద దించారో, అక్కడే వారిని తిరిగి వాహనంలోకి ఎక్కించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌కు బస్సులను మ్యాపింగ్‌ కూడా చేశారు.

5 లక్షల లక్ష్యం సాధ్యమేనా?

యోగాంధ్ర కార్యక్రమానికి 5 లక్షల మందిని తరలించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఆ బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. ఒక్కో సచివాలయానికి లక్ష్యాన్ని నిర్ధేశించారు. దీంతో వారు తమకు తెలిసిన వారితో పాటు సచివాలయానికి వచ్చిన వారందరి పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేసేశారు. చాలా మందికి రిజిస్ట్రేషన్‌ జరిగిన విషయం కూడా తెలియదు. తాము రిజిస్ట్రేషన్‌ చేయకుండానే మొబైల్‌కు మెసేజ్‌లు వచ్చాయని ఆశ్చర్యపోయారు. కొందరు సోషల్‌ మీడియా ద్వారా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఏదేమైనప్పటికీ, మొత్తం 7,72,812 మంది ప్రజలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో 5 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నా, అది ఎంత మేరకు సాధ్యమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ నుంచి ప్రజలను అర్థరాత్రి సమయంలో తరలించడం పెద్ద సవాలుగానే కనిపిస్తోంది. డ్వాక్రా మహిళలు తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని గ్రూప్‌ లీడర్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు, లేనిపక్షంలో రూ.500 ఫైన్‌ కట్టాలని, పథకాలు నిలిచిపోతాయని బెదిరిస్తున్నట్లు సమాచారం. దీంతో వీరు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయి. మిగిలిన వారు మాత్రం అర్థరాత్రి సమయంలో ఇతర జిల్లాల నుంచి వచ్చే అవకాశాలు తక్కువని అధికారులు సైతం అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, రెండు లక్షల వరకు ప్రజలు వస్తే గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంటుందని ఆశాభావంతో ఉన్నారు.

10 వేల మంది పోలీసులతో భద్రత

ప్రశాంత వాతావరణంలో యోగాంధ్ర వేడుకలు జరిగేలా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఐపీఎస్‌ల నుంచి కానిస్టేబుళ్ల వరకు విశాఖకు రప్పించారు. 10 వేల మందికి పైగా పోలీస్‌ అధికారులు, సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రధాని కాన్వాయ్‌ వెళ్లే ప్రాంతాలను బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్‌ నియంత్రణపైనా దృష్టి సారించారు.

విశాఖ సిద్ధం1
1/1

విశాఖ సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement