
గ్రేటర్ గాడిన పడేనా?
● ఐదు నెలల తర్వాత జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ ● అస్తవ్యస్తమైన పాలన.. కొరవడిన పర్యవేక్షణ ● సమస్యలతో స్వాగతం పలుకుతున్న గ్రేటర్ విశాఖ ● నేడు కేతన్ గార్గ్ బాధ్యతల స్వీకరణ
ఆర్థిక ఇబ్బందులు..
అభివృద్ధికి అడ్డంకులు
జీవీఎంసీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అభివృద్ధి పనులకు నిధుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జీవీఎంసీ బడ్జెట్లో భారీ లోటు ఉంది. 2025–26 అంచనాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే రూ.302.93 కోట్ల తగ్గుదల ఏర్పడింది. దీనికి తోడు, వివిధ పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ. 400 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల అడపా దడపాగా కొంత మేర చెల్లించినప్పటికీ ఐదు నెలలుగా పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో ఈ బిల్లులపై ఇన్చార్జి కమిషనర్ దృష్టి పెట్టలేదు. దీంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఖజానా ఖాళీగా ఉన్న ఈ తరుణంలో, పేరుకుపోయిన బకాయిలను చెల్లించి, కొత్త పనులకు నిధులు సమీకరించడం కమిషనర్కు పెను సవాల్గా మారనుంది.
డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) పాలన గాడి తప్పింది. సుమారు ఐదు నెలలుగా పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో అధికార యంత్రాంగం ఎవరికి వారే యుమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. పేరుకుపోయిన ఫైళ్లు, పరిష్కారానికి నోచుకోని ప్రజా సమస్యలు, నగర వీధుల్లో ఎక్కడికక్కడ చెత్త.. ఇలా సమస్యల వలయం మధ్య జీవీఎంసీ నూతన కమిషనర్గా కేతన్ గార్గ్ శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ప్రయాణం ఆరంభంలోనే సవాళ్లతో నిండిన కత్తిమీద సాములా మారింది.
గత ఐదు నెలలుగా జీవీఎంసీ పరిధిలో పనితీరు ఎలా ఉందో తెలుసుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఫైళ్లు నెలల తరబడి కదలడం లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదుల్లో సగం కూడా పరిష్కారం కాలేదు. గత కమిషనర్లు(ఇన్చార్జి కమిషనర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తప్ప) నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు చేసేవారు. స్థానికుల నుంచి సమస్యలడిగి తెలుసుకునేవారు. సాయికాంత్ వర్మ అయితే జోనల్ కమిషనర్లకు తెలపకుండానే ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇప్పుడు ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయి పర్యటనలు కరువయ్యాయి. జోనల్, అదనపు కమిషనర్లు సైతం కార్యాలయాలకే పరిమితం కావడంతో, నగరంలో పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది. ఈ అస్తవ్యస్తమైన పాలనను తిరిగి గాడిన పెట్టడం నూతన కమిషనర్ ముందున్న అతిపెద్ద బాధ్యత.
ముంచుకొస్తున్న ముప్పు.. రాజకీయ ఒత్తిళ్లు
వర్షాకాలం సమీపిస్తున్న వేళ నగరంలోని గెడ్డలు, కాలువలు పూడిక తీయక చెత్తతో నిండిపోయాయి. ఒక మోస్తరు వర్షానికే నగరం ముంపునకు గురవుతోంది. దీంతో రోగాలు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది.
మరోవైపు టీడీఆర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ఈ చిక్కుముడిని విప్పాల్సిన అవసరం ఉంది. వీటన్నింటికీ మించి మరో 10 నెలల పదవీకాలం మాత్రమే ఉన్న ప్రస్తుత పాలకవర్గంతో సమన్వయం సాధించడం అత్యంత కీలకం. పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య సమతూకం పాటిస్తూ కౌన్సిల్ సమావేశాలను సజావుగా నడపడం ఆయన నాయకత్వ పటిమకు పరీక్షగా నిలవనుంది. మొత్తం మీద కేతన్ గార్గ్కు జీవీఎంసీ కమిషనర్ కుర్చీ ముళ్ల కిరీటంలా మారనుంది. అస్తవ్యస్తంగా మారిన పాలనను చక్కదిద్దడం, ఆర్థిక వనరులను సమీకరించడం, ప్రజారోగ్యాన్ని కాపాడటం, పాలక, ప్రతిపక్షాల సమన్వయం సాధించడం వంటి బహుముఖ సవాళ్లను ఆయన ఎలా అధిగమిస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.