వైఎస్సార్‌సీపీ ‘యువత పోరు’ పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ‘యువత పోరు’ పోస్టర్‌ ఆవిష్కరణ

Jun 21 2025 2:54 AM | Updated on Jun 21 2025 2:54 AM

వైఎస్సార్‌సీపీ ‘యువత పోరు’ పోస్టర్‌ ఆవిష్కరణ

వైఎస్సార్‌సీపీ ‘యువత పోరు’ పోస్టర్‌ ఆవిష్కరణ

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 23న జరగనున్న ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి చందు ఆధ్వర్యంలో ‘యువత పోరు’ పోస్టర్‌ను ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, మొల్లి అప్పారావు, దేవన్‌రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నిరుద్యోగ భృతిని విస్మరించిందని, దానిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏడాది పాలనలో సూపర్‌సిక్స్‌ పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘ఇంటికో ఉద్యోగం లేదా నెలకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు’ ఇస్తామన్న హామీ కొండెక్కిందని విమర్శించారు. మంత్రి నారా లోకేష్‌ ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది జనవరి 1న నిరుద్యోగులకు జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ‘యువగళం’ పేరుతో రాష్ట్ర యువత అందరినీ లోకేష్‌ మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌, చింతలపూడి వెంకట రామయ్య, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవి రెడ్డి, పలువురు ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement