
వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలకు రాష్ట్రంలోని రైతులు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు మిర్చి యార్డు నుంచి మొన్న పొదలిలో పొగాకు రైతులను పరామర్శించడం వరకు వైఎస్ జగన్కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక టీడీపీ గూండాలు దాడులు చేసి, ఆ నెపాన్ని వైఎస్సార్ సీపీపై మోపాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలీసులతో అనేక విధాలుగా మా నాయకుడు పర్యటనను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అందులో భాగంగానే.. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పోలీసుల వేధింపులకు బలైన ఉపసర్పంచ్ నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే అనుమతి ఇవ్వకుండా కర్ఫ్యూ విధించారన్నారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్కు అండగా నిలిచారన్నారు. చివరికి టీడీపీకి చెందిన కార్యకర్తే ఆ పార్టీపై విసుగు చెంది పుష్ప–2 సినిమా డైలాగును పోస్టర్గా చేసి చూపిస్తే.. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కూటమి నాయకులు, పచ్చ మీడియా ఏదో తప్పు జరిగినట్లు విషప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి చంద్రబాబు డైరెక్షన్లో ఒక అడుగు ముందుకేసి ‘జగన్మోహన్రెడ్డి తల నరికితే తప్పేంటి?’ అని మాట్లాడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లక్షలాది మంది జనాభిమానం ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. అతన్ని ఏమీ చేయలేరని కె.కె.రాజు అన్నారు.