
తూర్పు తీర లాజిస్టిక్స్ రాజధానిగా ఎదగడమే లక్ష్యం
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ను భారతదేశానికి తూర్పు తీర లాజిస్టిక్స్ రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. నోవాటెల్లో శుక్రవారం జరిగిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పోర్ట్ ఆపరేటర్లు, లాజిస్టిక్స్ ప్రొవైడర్లు, షిప్పింగ్ లైన్లు, మౌలిక సదుపాయాల డెవలపర్లు, ప్రపంచ భాగస్వాములను ఆహ్వానించారు. రాష్ట్రంలో భూమి లభ్యత, సులభతర అనుమతులు ఉన్నాయని, బలమైన ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా స్థిరమైన మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, ఎయిర్ కార్గో టెర్మినల్స్, లాజిస్టిక్స్ పార్కుల ద్వారా వాణిజ్యాన్ని పెంచడం, ఉద్యోగాలను సృష్టించడం, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గత ఏడాది కాలంలో పోర్టులు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. పారిశ్రామిక వృద్ధి, వాణిజ్య పోటీతత్వం, ప్రాంతీయ శ్రేయస్సుకు బలమైన లాజిస్టిక్స్ అత్యవసరం అన్నారు. ఇందుకనుగుణంగా రామయ్యపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టుల తొలి దశ పనులు 2026 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని చెప్పారు. అన్ని రవాణా విధానాలలో సమగ్ర అభివృద్ధిని సాధించడానికి, పోర్టులు, విమానాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు, రోడ్ కారిడార్లను సమన్వయం చేయడానికి రాష్ట్ర లాజిస్టిక్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు.