
అర్ధసెంచరీ భాగస్వామ్యం అందించిన రాహుల్–తపస్వి జోడీ
వైజాగ్ వారియర్స్పై భారీ విజయం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్లో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఉత్తరాంధ్ర లయన్స్ 93 పరుగుల భారీ తేడాతో వైజాగ్ వారియర్స్పై విజయం సాధించింది. టాస్ గెలిచి వైజాగ్ వారియర్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాంధ్ర లయన్స్ ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోర్. ఓపెనర్లు గుల్ఫమ్(13), కెప్టెన్ భరత్ 45(3 x4, 4 x6) 67 పరుగులకే పెవిలియన్ చేరినా.. టాప్ ఆర్డర్ చెలరేగిపోయారు. రాహుల్ 36 బంతుల్లో 54(3 x4, 3 x6), శ్యాంసుందర్(20), తపస్వి 23 బంతుల్లో 38(4x4,2 x6)తో స్కోర్ను 205 పరుగులకు చేర్చారు. శ్రీనివాస్ అజేయంగా 13 బంతుల్లోనే ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో 33 పరుగులు రాబట్టాడు. వర్మ రెండు వికెట్లు తీయగా గిరీష్కుమార్, సిద్ధార్థ, వేణు ఒక్కో వికెట్ తీశారు. ప్రతిగా భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వైజాగ్ వారియర్స్ 113 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ అర్జున్ ఐదు ఫోర్లు, ఒక సిక్సర్తో 29 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో ఓపెనర్ కెప్టెన్ అశ్విన్ హెబ్బర్ 8 పరుగులకే అయ్యప్ప బౌలింగ్లో కీపర్ భరత్కు దొరికిపోయాడు. ప్రశాంత్ మూడు ఫోర్లు ఒక సిక్సర్తో కాసేపు మెరిపించగా 28 పరుగులతో వాసు బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. కరణ్(13) తేజస్వికి దొరికిపోయాడు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దీంతో 14.4 ఓవర్లలోనే వైజాగ్ వారియర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. తపస్వి, పృథ్వీ మూడేసి వికెట్లు తీయగా వాసు రెండు, అయ్యప్ప ఒక వికెట్ పడగొట్టాడు.
తడబడిన టైటాన్స్
తొలి రెండు మ్యాచ్ల్లో విజయకేతనం ఎగురవేసిన గోదావరి టైటాన్స్ మూడో మ్యాచ్లో కాస్త తడబడింది. రాయలసీమ కింగ్స్ చేతిలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి టైటాన్స్ తొమ్మిది వికెట్లకు 150 పరుగులు చేసింది. కెప్టెన్ జ్ఞానేశ్వర్(3)తో సహా వంశీ(9),హూమంత్(3),సందీప్(7)మనీష్(5) టాప్ ఆర్డర్ కూలడంతో 40 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. టాప్ మిడిలార్డర్లో పాండురంగరాజు(23)ధీరజ్(20) కాస్త నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా 78 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. లోయర్ మిడిలార్డర్లో విజయ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా మరో ఎండ్లో సమన్విత్(11) మినహా సహకారం కరవైంది. విజయ్(63పరుగులు, 24బంతుల్లో ఆరుఫోర్లు, ఐదు సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. హరిశంకర్ మూడు వికెట్లు తీయగా గిరినాఽథ్ రెండు వికెట్లు తీశాడు. ప్రతిగా 151పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ కింగ్స్ 17.4ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ హనుమ విహారీ(21పరుగులు)కి మరో ఓపెనర్ అభిషేక్(53పరుగులు) తోడై నిలకడగానే ఆడుతూ బలమైన పునాది వేశారు. వంశీకృష్ణ (మూడు ఫోర్లు, ఒక సిక్సర్) 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. మాధవ్ వేసిన బంతిని వంశీకృష్ణ ఫైన్లెగ్లో బౌండరీకి తరలించడంతో కింగ్స్ ఐదు వికెట్లకు 153 పరుగులతో విజయం సాధించింది. ఇస్మాయిల్ మూడు వికెట్లు తీయగా మాధవ్, విజయ్ చెరో వికెట్ తీశారు.

ఓపెనర్గా లయన్స్ భరత్