అనంతగిరి: విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ పిలుపునిచ్చారు. గురువారం వికారాబాద్లో బంద్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 27వేల పాఠశాలలను నాలుగు వేలకు కుదించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని గాలికి వదిలేసి ప్రవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలన్నారు. నేటి(శుక్రవారం) బంద్లో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తేజ, నాయకులు ఇస్మాయిల్, శివ, ఆమెర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర బృందం
మోమిన్పేట: మండల కేంద్రంలోని నంది వాగు ప్రాజెక్టును కేంద్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు గురువారం పరిశీలించింది. కుడి, ఎడమ కాలువలకు తక్షణం మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. పంట కాలువలు పూర్తిగా మూసుకుపోయాయని, వాటిని పునరుద్ధరించాల్సి ఉందన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలుగు వద్ద కాలువులు పూర్తిగా దెబ్బతిన్నాయని గుర్తించారు. ఆయకట్టు 2,650 ఎకరాలకు సాగునీరు అందాలంటే అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ రవికుమార్, డీఈఈ సబియాబేగం, ఏఈఈ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: జిల్లాలో ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించే సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల జనజాగరణ యాత్రను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్ పిలుపునిచ్చారు. గురువారం వికారాబాద్లో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్, వెంకటరత్నం, సుదర్శన్, సీపీఎస్ ఈయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అయూబ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురహరి, జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్, శ్రీనివాస్, నరేందర్, రఘునాథ్, ఇఫ్తేకార్, కృష్ణారెడ్డి, రెహ్మాన్ పాల్గొన్నారు.
బంట్వారం: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత అని డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ అన్నారు. గురువారం కోట్పల్లి పీహెచ్సీని సందర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. విధి నిర్వహణలో నిరక్ష్యం వహించరాదని సూచించారు. కార్యక్రమంలో వైద్యురాలు మేఘన, సిబ్బంది పాల్గొన్నారు.


