● చార్మినార్ జోన్ డీఐజీ చౌహాన్
● ఎస్పీ కార్యాలయం సందర్శన
అనంతగిరి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రికార్డుల నిర్వహణను మెరుగుపరుచుకోవాలని చార్మినార్ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ సూచించారు. ఎస్పీ స్నేహ మెహ్ర బొకే అందజేసి స్వాగతం పలికారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎస్పీ చాంబర్ను ప్రారంభించారు. డీపీఓ సెక్షన్, రికార్డులు, ఆయుధగారం విభాగాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రికార్డుల నిర్వహణ, ఫైళ్లను భద్రపరచడం, పరిపాలనా విధానాలు సక్రమంగా ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. క్రమశిక్షణ, పరిశుభ్రత, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజా ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. సమన్వయంతో పనిచేస్తూ, కార్యాలయ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజేశ్ మీనా, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, డీఏఆర్ డీఎస్పీ వీరేశ్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.


