● ఆర్టీసీ కార్మికులు
● కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు
● మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
పరిగి: హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న తమపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సరికాదని ఆర్టీసీ కార్మికులు అన్నారు. పరిగి డిపో వద్ద కార్మికుల నిరసన గురువారం రెండో రోజుకు చేరుకుంది. డిపో, బస్టాండ్ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ప్రైవేటు డ్రైవర్లతో పలు రూట్లలో బస్సులను నడిపారు. కార్మికులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులతో మాపై దాడులు చేయించడం సరికాదన్నారు. మా ఓట్లతో గద్దె ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో గద్దె దింపడం పెద్దపనేమీ కాదని హెచ్చరించారు. ప్రైవేటు డ్రైవర్లు వచ్చి మా పొట్ట కొట్టరాదని వారిని వేడుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.


