
పారిశ్రామిక పరుగులు
రైతుల నిర్బంధాలు, ప్రతిఘటనలు, నిరసనగళంతో గతంలో అట్టుడికిన దుద్యాల్ మండలంలో ప్రస్తుతం పారిశ్రామికవాడ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందులో సింహభాగం భూ సేకరణ జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.
దుద్యాల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలోని హకీంపేట్, పోలేపల్లి, లగచర్ల, పులిచర్లతండా, రోటిబండతండా గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. నిత్యం ఏదో ఒక శాఖకు చెందిన ఉద్యోగులు వచ్చి భూములకు హద్దులు నిర్ధారిస్తున్నారు. ఎన్నో ఆటంకాల మధ్య సాగిన భూ సేకరణ చివరి దశకు చేరుకుందని వారు తెలుపుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) అధికారులు పారిశ్రామికవాడ భూములను పరిశీలించారు. పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం 1,177.35 ఎకరాలకు నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. అధికారులు నేటివరకు 658 మంది పట్టాదారులకు సంబంధించిన 914.12 ఎకరాల భూమిని సేకరించారు. పోలేపల్లి గ్రామంలో 48 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం టీజీఐఐసీకి అప్పగించారు. వాటికి పరిహారంగా దాదాపు రూ.180 కోట్ల వరకు చెల్లించారు. భూ సేకరణ పోలేపల్లిలో పూర్తి కాగా లగచర్ల, హకీంపేట్ రెవెన్యూ గ్రామాల్లో ఇంకా 263.23 ఎకరాలు సేకరించాల్సి ఉంది.
ఇక కంపెనీల ఏర్పాటు
ఇప్పటివరకు సేకరించిన భూముల్లో ప్రభుత్వం త్వరలో కంపెనీల ఏర్పాటుకు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఫార్మా ఏర్పాటు రద్దు చేసిన నేపథ్యంలో ఎలాంటి కంపెనీలు ఏర్పాటు చేస్తారో అనే చర్చ కొనసాగుతోంది. కాలుష్య రహిత కంపెనీలు ఏర్పాటు చేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.
ఉపాధి పండుగ
కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభమైతే నియోజకవర్గంలోని కూలీలకు, 10వ, ఇంటర్ స్థాయిలో చదువుకున్న వారికి సూపర్వైజర్లుగా ఉపాధి లభిస్తుంది. స్థానిక కాంట్రాక్టర్లకు సైతం చేతినిండా పనులు దొరుకుతాయని భావిస్తున్నారు. కంపెనీల నిర్మాణ దశలో వేల సంఖ్యలో కూలీలు అవసరం ఉంటుందని, ఇక్కడి ప్రాంత వాసులు ఇరత ప్రాంతాలకు వెళ్లి పనులు చేయాల్సిన అవసరం లేదనే సంతోషంలో ఉన్నారు.
భూ సేకరణలో వేగం పెంచిన అధికారులు
నిర్ధారించిన హద్దులకు రంగులు
ఇప్పటి వరకు సేకరించిన భూమి 914.12 ఎకరాలు
మిగిలింది మరో 263.23 ఎకరాలే..
త్వరలో కంపెనీలకు అప్పగించే అవకాశం!
పరిశీలించిన టీఎస్ఐఐసీ అధికారులు
సేకరించిన భూ వివరాలు
పారిశ్రామవాడ ఏర్పాటుకు ప్రభుత్వం 1,177.35 ఎకరాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా పోలేపల్లి గ్రామంలో 38 మంది రైతుల నుంచి 73.39 ఎకరాల అసైన్డ్ భూమితో పాటు 48 ఎకరాల ప్రభుత్వ భూమిని అదనంగా స్వాధీనం చేసుకున్నారు. హకీంపేట్లో 172 మంది రైతులకు సంబంధించి 261.33 ఎకరాల అసైన్డ్, 143.21 ఎకరాల పట్టాభూమి, లగచర్ల రెవెన్యూ పరిధిలో 64 మంది రైతులకు సంబంధించి 72.26 ఎకరాల అసైన్డ్, 212 మంది రైతుల నుంచి 314.13 ఎకరాల పట్టా భూమిని అందించారు. ఇప్పటికే 862.02 ఎకరాలు సేకరించిన అధికారులు మరో 263.23 ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు.
సేకరణకు రైతులు అనుకూలం
రైతులతో మాట్లాడుతున్నాం. త్వరలో మిగిలిన భూమి సేకరిస్తాం. రైతులు అనుకూలంగా ఉన్నారు. అన్నదమ్ముల, తాతల భాగాల్లో తేడా ఉన్నందున సరి చేసుకుని ఇస్తామని చెబుతున్నారు. వారితో నిరంతరం మాట్లాడుతున్నాం.
– కిషన్, తహసీల్దార్ దుద్యాల్

పారిశ్రామిక పరుగులు

పారిశ్రామిక పరుగులు