
గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించండి
దుద్యాల్: ఈర్లపల్లి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డిని కోరారు. ఈ మేరకు గురువారం వారు కొడంగల్లోని కడా కార్యాలయంలో వెంకట్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 26 మహిళాసంఘాలకు గాను డ్వాక్రా భవనం, పీర్ల ఏర్పాటుకు మసీద్, ముస్లింలకు కబరస్తాన్ కోసం ఎకరా స్థలం కేటాయించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, మహిళా సంఘం గ్రామ అధ్యక్షురాలు సరిత, గ్రామస్తులు విజి బాయి, రవినాయక్, మొగులయ్య, బాష, మహమ్మద్, గుడ్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి ప్రవేశ పోటీలకు 14 మంది బాలలు
కుల్కచర్ల: తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలకు విద్యార్థులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా గురువారం మండల కేంద్రంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయి క్రీడా పాఠశాల ప్రవేశ పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి హబీబ్ అహ్మద్ మాట్లాడుతూ.. మండల పరిధిలో 10 మంది బాలురు, నలుగురు బాలికలను జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ప్రవేశ పరీక్షకు ఎంపిక చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు ప్రవీణ్, కవిత, కేశవులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలకు రూ.లక్ష విలువైన వస్తువుల వితరణ
అనంతగిరి: ప్రతీ ఒక్కరు సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సిద్ధులూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ మండలం సిద్ధలూరు జెడ్పీహెచ్ఎస్కు రిటైర్డ్ జీహెచ్ఎం పురుషోత్తం శాస్త్రి రూ.లక్ష విలువైన సామగ్రి అందజేశారు. విద్యార్థులకు ప్లేట్లు, బెల్టులు, ఐడీ కార్డులు, పాఠశాలకు మైక్సెట్, ప్రింటర్, టేబుల్స్, కుర్చీలు తదితర సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పురుషోత్తం శాస్త్రి ఈ ప్రాంతంలో పనిచేసినప్పడి నుంచి పాఠశాల అభివృద్ధికి పరితపించారన్నారు. ప్రతీ సంవత్సరం పాఠశాలకు ఏదో విధంగా సహకరిస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం పురుషోత్తంశాస్త్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందజేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. రామకృష్ణారెడ్డి ఎక్కడ పనిచేసిన ఆ పాఠశాల అభ్యున్నతికి పాటుపడుతారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వినోద్, వెంకటేశ్, రమేశ్, రాజు, సంగీత, శ్రీదేవి, మీనాకుమారి, ఆంజనేయులు, నరేశ్, నాగలత పాల్గొన్నారు.
నాణ్యమైన పాలే సేకరించాలి
టీజీడీడీసీఎఫ్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి కవిత
కడ్తాల్: పాడి రైతుల నుంచి నాణ్యమైన పాలు సేకరించాలని తెలంగాణ పాడి పారిశ్రామికాభివృద్ధి సహకార సమాఖ్య (టీజీడీడీసీఎఫ్) చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి కవిత సూచించారు. కడ్తాల్ పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోని సొసైటీల అధ్యక్షులు, వేతన కార్యదర్శులతో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయ డెయిరీ ద్వారా సేకరించే పాలు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయన్నారు.

గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించండి

గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించండి