
నాలుగు విడతల్లో నగదు జమ
అనంతగిరి: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని.. నాలుగు విడతల్లో బిల్లులు ఎప్పటికప్పుడు ఖాతాలో జమ అవుతాయని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం ఆయన వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ పట్టణంలో 359 మంది, మండల పరిధిలో 254 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్కుమార్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతాయని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా అందరికీ ఏక కాలంలో ఇళ్లు ఇవ్వలేక పోతున్నామని ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పేదలు కడుపు నిండా అన్నం తినాలనే సదాశయంతో రాష్ట్రంలో సన్నబియ్యం ప్రారంభించామన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధికి అధికంగా నిధులను కేటాయిస్తోందన్నారు.
తొమ్మిది రోజుల్లో భరోసా
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదే అన్నారు. ఉద్యోగులు పేదలకు సేవాభావంతో పనిచేయాలని సూచించారు. వానాకాలం పంటల సాగుకు రైతు భరోసా డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. నిన్నటి వరకు నాలుగు ఎకరాల వరకు రైతులకు అందాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది రోజులలో రూ.9వేల కోట్లు రైతులకు అందుతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న భూములలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు అందుతాయని వివరించారు. అనంతగిరిని పర్యాటకంగా రూ.వేయి కోట్లతో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మెగా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని.. ఈ ప్రాజెక్టుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనునట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్డీఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ కృష్ణయ్య, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్టీఏ సభ్యులు జాఫర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారాయణ, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
613 మంది లబ్ధిదారులకు ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేత
స్టాల్ ప్రారంభం
తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇందిర మహిళా శక్తి మన దుకాణం స్టాల్ ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు.

నాలుగు విడతల్లో నగదు జమ