
ఎస్సీ, ఎస్టీలకే సబ్ప్లాన్ నిధులు
అనంతగిరి: ప్రతీ మూడు నెలలకు ఓసారి డీవీఎంసీ (డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశాలు నిర్వహించి సంబంధిత శాఖల అధికారులు పాల్గొని జిల్లాలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం ఆయన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నుంచి వివిధ శాఖల ద్వారా ఎస్సీ వర్గాలకు వెచ్చిస్తున్న నిధులపై కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలన్నారు. జనాభా ప్రాతిపదికన వాటాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ భూ సమస్యలు పరిష్కారం చూపాలన్నారు. జూలై నుంచి ప్రతీ నెల చివరి శనివారం పౌర హక్కుల దినం నిర్వహించి ఈ కార్యక్రమానికి తహసీల్దార్, పోలీస్ అధికారి తప్పక హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ ప్రతీక్జైన్కు సూచించారు. చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాస్ పథకాల్లోనూ వాటాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ల పథకాల్లో అర్హులైన పేదలకు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్జైన్ కమిషన్ చైర్మన్ వెంకటయ్య, సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్, రాంబాబు నాయక్ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, ఎం.సుధీర్, డీవీఎంసీ సభ్యులు పెండ్యాల అనంతయ్య, గోవింద్ నాయక్, దస్తప్ప, ఎస్.రాజలింగం, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాల సందర్శన
వికారాబాద్కు విచ్చేసిన బక్కి వెంకటయ్య కొత్తగడి రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కిచన్, స్టోర్రూంను పరిశీలించి భోజన సదుపాయాలపై ప్రిన్సిపాల్ సాయిలత. డీఎస్సీడీఓ కమలాకర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని తెలుసుకున్నారు.
తేనీటి విందు
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబునాయక్, శంకర్, వికారాబాద్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ నివాసానికి వెళ్లి తేనీటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ ఉద్యమ కాలం జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజలింగం, మాజీ కౌన్సిలర్ కిరణ్పటేల్, సురేశ్గౌడ్, దేవదాసు, కేదార్నాథ్, శాంత్కుమార్, రుకుం, సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు.
దళితులపై దాడులు అరికట్టండి
తాండూరు రూరల్: తాండూరు ప్రాంతంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గురువారం వికారాబాద్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశానికి హాజరైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అట్రాసిటీ కేసులను నీరుగారుస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. తాండూరులో పర్యటించి దళితులకు అండగా నిలవాలని చైర్మన్ను కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, కేవీపీఎస్ కార్యదర్శి మల్కయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జినుగుర్తి నర్సింలు ఉన్నారు.
దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవు
ప్రతీ నెల చివరి శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య