
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
సాక్షి, రంగారెడ్డిజిల్లా: సీజనల్ వ్యాధులపై అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి 68 అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన వినతులను పెండింగ్లో పెట్టొద్దని అన్నారు. ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించి, బాధితులకు తగిన పరిష్కార మార్గం చూపించాలని ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం తలెత్తే ప్రమాదం ఉందన్నారు. వీధుల్లో చెత్త పేరుక పోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, మురుగు నీటి కాల్వల్లోని వ్యర్థాలను తొలగించి, వరద నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు సీజనల్ రోగాల బారినపడే ప్రమాదం ఉందని, వ్యాధుల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్ఓ సంగీత, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి