
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
● రైతు వేదికల్లో ఏఈఓలు అందుబాటులో ఉండాలి ● జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి
మోమిన్పేట: విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించమని, వ్యవసాయాధికారులు తప్పని సరిగా సమయపాలన పాటించాలని డీఏఓ మోహన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికను ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో ఏఈఓలు అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పంటల సాగుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఇక్క డికి వస్తుంటారని, అధికారులు అందుబాటులో లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అప్పటికే చాలా మంది అన్నదాతలు రైతు భరోసా కోసం దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చారు. కొంత మంది ఏఈఓలకు ఫోన్ చేసినా వారు అందుబాటులోకి రాలేదు. అరగంట తర్వాత ఒక్కొక్కరుగా రైతు వేదిక వద్దకు వచ్చారు. ఏఈఓలు ఆలస్యంగా రావడంపై డీఏఓ మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఆలస్యంగా వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమయానికి రైతు వేదికలో ఉండాలని ఆదేశించారు. రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు చాలా మంది ఇక్కడికి వస్తుంటారని అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. వానాకాలం సీజన్కు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ జయశంకర్ తదితరులు ఉన్నారు.