డ్రగ్స్‌ రహిత రాష్ట్రమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత రాష్ట్రమే లక్ష్యం

Jun 18 2025 7:33 AM | Updated on Jun 18 2025 7:33 AM

డ్రగ్స్‌ రహిత రాష్ట్రమే లక్ష్యం

డ్రగ్స్‌ రహిత రాష్ట్రమే లక్ష్యం

● గడిచిన ఏడాదిలో 30వేల కిలోల గంజాయి సీజ్‌ చేశాం ● రాష్ట్రంలో గంజాయిలేదు.. పక్క రాష్ట్రాల నుంచి సరఫరా అవుతోంది ● సైబర్‌ నేరాల అదుపులో మనమే ముందున్నాం ● రూ.185 కోట్లు రికవరీ చేశాం ● డీజీపీ జితేందర్‌ వెల్లడి

వికారాబాద్‌: డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు పని చేస్తున్నారు.. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం.. అని డీజీపీ జితేందర్‌ అన్నారు. మంగళవారం వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ప్రమాదాల నివారణ, ఇసుక అక్రమ రవాణా, మతపరమైన ఘర్షణలు, నివారణ చర్యలు తదితర వాటిపై సమీక్ష చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన ఏడాది కాలంలో 30వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి లేదని.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా సరఫరా అవుతోందన్నారు. దీన్ని కూడా సమర్థవంతంగా అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు. సైబర్‌ నేరాల అదుపులో దేశంలోనే రాష్ట్రం ముందుందని.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ధ్రవీకరించిందన్నారు. దీంతో మన పోలీసులపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. సైబర్‌ నేరాల కట్టడికి రెండు వందల మందికిపైగా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. గడిచిన ఏడాది కాలంలో సైబర్‌ మోసాల ద్వారా కోల్పోయిన రూ.185 కోట్లు రాబట్టామని, ఈ సొమ్మును బాధితులకు తిరిగి అప్పగించామన్నారు. సైబర్‌ నేరాల అదుపులో మన పోలీసులు దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచారని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల కట్టడికి ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డయల్‌ 100 ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. ఇటీవల ఓ సింగర్‌ తోపాటు ఇతరులపై కేసు నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం పోలీసులకు పలు సూచనలు చేశారు. ఇసుక మాఫియా, జూదం, మట్కా, పీడీఎస్‌ రైస్‌ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అట్రాసిటీ కేసుల విషయంలో పకడ్బందీగా దర్యా ప్తు చేసి, దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో ఐజీ సత్యనారాయణ, డీఐజీ తఫ్సీర్‌ ఇక్బాల్‌, ఎస్పీ నారాయణరెడ్డి, అడిషనల్‌ ఎస్పీ హన్మంతరావ్‌, డీఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌, బాలకృష్ణారెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, ఏఆర్‌ డీఎస్పీ, వీరేశ్‌, సీఐలు పాల్గొన్నారు.

డీజీపీని కలిసిన కలెక్టర్‌

అనంతగిరి: వికారాబాద్‌ పర్యటనకు వచ్చిన డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ను కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ స్వాగతం పలికారు. ఆయన వెంట ఎస్పీ నారాయణరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement