పెళ్లకూరు: మండలంలోని చిల్లాకూరు గ్రామంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి బుధవారం తన వ్యవసాయ భూములకు చెందిన పంట కాలువ పనులు చేస్తుండగా స్థానిక టీడీపీ నాయకులు రాకేష్రెడ్డి, చైత్యకృష్ణారెడ్డి తదితరులతో కలిసి పనులను అడ్డుకుని రౌడీయిజం చేశారు. గ్రామంలో ఉన్న సత్యనారాయణరెడ్డి కుమార్తెకు చెందిన వ్యవసాయ భూములకు సాగు నీరు అందించే పంట కాలువ పనులను కూలీలతో చేయించుకుంటున్నారు. దాంతో స్థానిక టీడీపీ నాయకులు అల్లరిమూకలతో కలిసి పనులను అడ్డుకున్నారు. సత్యనారాయణరెడ్డి అనుచరులపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివాదాన్ని సర్దుబాటు చేశారు.
టీడీపీ దుష్ప్రచారం
చిల్లకూరు వడ్డిపాళెం గ్రామానికి చెందిన వలిపి బాలయ్య(55) మృతిపై గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం మంచిది కాదని స్థానికులు అంటున్నారు. బుధవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పంట కాలువ పనులను చేయించుకుంటుండగా గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు రాకేష్రెడ్డి, చైత్యకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, లోకేష్నాయుడు పలువురు ఆ పార్టీ అల్లరిమూకలతో కలిసి అక్కడికి చేరుకుని రౌడీయిజం చేశారు. ఈక్రమంలో చిల్లకూరు వడ్డిపాళెం గ్రామానికి చెందిన బాలయ్య ఘర్షణ సమయంలో దూరంగా నిలబడి చూస్తుండగా అనారోగ్య సమస్యలతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న బాలయ్యను హుటాహుటిన పెళ్లకూరు పీహెచ్సీకి చికిత్స నిమిత్తం తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. కాని టీడీపీ శ్రేణులు మాత్రం శవ రాజకీయాలు చేస్తూ ఆపార్టీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో బాలయ్య మృతి పట్ల తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటో పోలీసులకు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పూర్తిగా తెలిసినప్పటికీ లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


