– గ్రామీణ వారసత్వం మోనోగ్రాఫ్ను ఆవిష్కరించిన కలెక్టర్
తిరుపతి అర్బన్: గ్రామీణ వారసత్వ సంపదను సమన్వయంతో సమష్టిగా పరిరక్షిద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో రూపొందించిన ‘తిరుపతి జిల్లా గ్రామీణ వారసత్వం’ మోనో గ్రాఫ్ను కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలు , సాంస్కృతిక సంప్రదాయాలతోపాటు పురావస్తు సంపదను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించి, డాక్యుమెంట్ చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ వారసత్వ సంపదను పరిరక్షించడంతో పాటు, దాని ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఇలాంటి ప్రచురణలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మోనోగ్రాఫ్ రూపకల్పనలో కృషి చేసిన జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు.


