తిరుపతి రూరల్ : తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆలయ వ్యవస్థాపకుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తుమ్మలగుంటలోని ఆయన నివాసం వద్ద ఆలయ అధికారులు, సిబ్బంది, కార్మికులతో ప్రత్యేకంగా ఉత్సవాలపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లు, భద్రత, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సూచనలు అందించారు. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. చంద్రగిరి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పల్లెల నుంచి తీసుకురావాల్సిన సారె విషయంలో ఎక్కడా లోటు లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. అన్ని కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆలయ కమిటీ సభ్యులు చెవిరెడ్డి లక్ష్మి, మోహిత్రెడ్డి, ఈఓ సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు.


