సూళ్లూరుపేట: సతీష్ధవన్ స్పేస్సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సెప్టెంబర్ 4వ తేదీన వేకువజామున 2.55 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్–17 నింగిలోకి వెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా 1,117 కిలోల బరువైన ఈఓఎస్–05 ఉపగ్రహం అంతరిక్షంలోకి చేరనుంది. ఈ ఉపగ్రహం భూమికి దగ్గరగా 175 కిలోమీటర్లు, భూమికి దూరంగా 28,934 కిలోమీటర్లు ఎత్తులోని సబ్ జియో ట్రాన్స్పర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. జీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 19వ ప్రయోగం, షార్ నుంచి 106వ ప్రయోగం కావడం విశేషం.
మూడు దశలుగా..
పీఎస్ఎల్వీ రాకెట్ను నాలుగు దశల్లో ప్రయోగిస్తే జీఎస్ఎల్వీ రాకెట్ను మూడు దశల్లోనే ప్రయోగిస్తారు. 51.7 మీటర్లు పొడవైన జీఎస్ఎల్వీ ఎఫ్–17 రాకెట్ ప్రయోగ సమయంలో 420 టన్నుల బరువుతో భూమినుంచి నింగికి బయలు దేరుతుంది. వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లో రాకెట్ అనుసంధానం పూర్తి చేసి ప్రయోగానికి సిద్ధం చేసేందుకు తుది పరీక్షలు నిర్వహించి సోమవారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించనున్నారు.


