పింఛన్‌.. తుంచెన్‌ | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌.. తుంచెన్‌

Aug 31 2026 12:14 AM | Updated on Aug 31 2026 12:14 AM

27 నెలలుగా ఒక్క కొత్త పింఛన్‌ లేదు

అల్లాడిపోతున్న అభాగ్యులు

చోద్యం చూస్తున్న కూటమి నేతలు

తిరుపతి అర్బన్‌: పింఛన్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్న పింఛన్లు తీసేస్తుండగా.. కొత్త పింఛన్లు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం విడ్డూరంగా మారింది. జిల్లాలో గత ఏడాది సెప్టెంబర్‌లో 2,67,772 మందికి ఎన్టీఆర్‌ సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌కు 2,60,546 మందికి పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఏడాది కాలంలోనే 7,226 మంది పింఛన్లు తగ్గించారు. అలాగే 2024 ఆగస్ట్‌ నుంచి 2025 ఆగస్ట్‌ వరకు 7,758 మంది పింఛన్లు తీసేశారు. మొత్తంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత జిల్లాలో 15 వేల పింఛన్లు తగ్గాయి.

కొత్త పింఛన్లకు 25 వేలకు పైగా ఆర్జీలు

ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టరేట్‌తోపాటు 691 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటి వరకు 25 వేలకు పైగా అర్జీలు వచ్చాయి. అందులో ఏడు వేల మంది వితంతువులు ఉన్నారు. ఏ ప్రభుత్వంలోనూ వితంతువులకు ఇలా పింఛన్ల పంపిణీలో జాప్యం చేయలేదని పలువురు వాపోతున్నారు.

50 ఏళ్లకే పింఛన్‌ హామీ ఏమైంది?

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛన్లు మంజూరు చేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ప్రతి బహిరంగ సభలో ఈ అంశాన్ని ఊదరగొట్టి ఓట్లు దండుకున్నారు. తీరా గద్దెనెక్కిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కేశారు.

కొత్త పింఛన్ల కోసం ఎదురు చూపు

కొత్త పింఛన్ల కోసం లక్ష మంది అర్హులు ఎదురుచూస్తున్నారు. పీజీఆర్‌ఎస్‌కు 25 వేలకు పైగా అర్జీలు అందగా.. 50 ఏళ్ల పింఛన్లకు జిల్లాలో 75 వేల మంది అర్హులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

గతంలో ఆరు నెలలకోసారి కొత్త పింఛన్లు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు ఇచ్చేవారు. ఏటా జనవరి 1 నుంచి జూన్‌ 30 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జూలైలో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. అలాగే జూలై 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జనవరిలో కొత్త పింఛన్లు ఇచ్చేవారు. అయితే ఈ 27 నెలల కూటమి పాలనలో ఒక్క కొత్త పింఛన్‌ కూడా మంజూరు చేయలేదు.

కొనసాగుతున్న పింఛన్ల తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement