తిరుపతిలో వైఎస్సార్సీపీ శ్రేణులను అరెస్టు చేస్తూ..
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ నేతలు అధికార జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అడ్డుకుని.. ఆపై దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా గాయపడిన వారినే అరెస్టు చేసి, అక్రమ కేసులు నమోదు చేయించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారం ఉంటే ఏదైనా చెయవచ్చు అన్నదానికి నిదర్శనమే తిరుపతి శిల్పారామం వద్ద సోమవారం జరిగిన ఘటన. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు బీఆర్ నాయుడు ఓ మహిళతో వంటగదిలో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. నాడు ప్రెస్మీట్ అనంతరం దూరంగా ఉన్న బీఆర్ నాయుడు సోమవారం తిరుపతికి చేరుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలకమండలి అయిన బీఆర్ నాయుడు వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఫ్లకార్డులతో హోటల్ ముందు నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ శ్రేణులను టీడీపీ నేతలు జేబీ శ్రీనివాసులు, పులిగోరు మురళితో పాటు వారి అనుచరులు అడ్డుకుని.. ఆపై దాడికి తెగబడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నా.. నిరసనను అడ్డుకునే అధికారమే లేని టీడీపీ నేతల బరితెగింపును న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. అంతటితో ఆగని టీడీపీ గూండాలు ‘కామాందులు ఎలా ఉంటారో రండి చూపిస్తాం’ అంటూ వైఎస్సార్సీపీ మహిళ నాయకులను అసభ్య పదజాలాలతో దూషించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతటితో ఆగని అధికారపార్టీ నేతలు.. పోలీసులతో గాయపడిన వారిని, నిరసన తెలియజేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్టేషన్కు తరలించారు. సంబంధమే లేని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి 13 మంది వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీస్టేషన్లో కూర్చోబెట్టడానికి న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. ఆ 13 మందిలో మహిళలు కూడా ఉండడం గమనార్హం.


