చిల్లకూరు : మండలంలోని తీర ప్రాంత గ్రామామైన తూర్పుకనుపూరు ముత్యాలమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి నుంచి అట్టహాసంగా జాతర నిర్వహించనున్నారు. ఉగాది పండుగకు ముందుగా వచ్చే మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు మూడు రాష్ట్రాల నుంచి భక్తులు సుమారు ఐదు లక్షల మంది వరకు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. పేరుకు ముత్యాలమ్మ జాతర అయినప్పటికీ ఇక్కడ ముత్యాలమ్మ సోదరిగా భావించే పోలేరమ్మకు కూడా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఘటోత్సవంతో జాతర ఆరంభం
జాతరలో భాగంగా తొలిరోజు ఆదివారం అర్చకులు చాకిరి రమణయ్య ఇంటి నుంచి ఘటోత్సవాన్ని ఆరంభించారు. అక్కడ పనిబాపల వారు ఘటం కుండను నెత్తిన పెట్టుకుని పంచాయతీలోని కొమవారిపాళెం, పోసిన వారిపాళెం, ఈదుల వారిపాళెం గ్రామాలలో ఎంపిక చేసిన వారి ఇళ్లకు వెళ్లి సద్ది పోసుకునే తంతు ముగించుకుని తిరిగి కనుపూరుకు వేంచేశారు. ఆ తరువాత చాకలి ఇంటి వద్ద ఘటం కుండలు దించి పోలేరమ్మ ప్రతిమను కుమ్మరి ఇంట్లో తయారు చేయించే ప్రక్రియను మొదలు పెడతారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత పొలి కార్యక్రమం ఉంటుంది. అమ్మ వారి ప్రతిమ గంగ మిట్టమీద కొలువుదీరే సరికే మంగళవారం అర్ధరాత్రి అవుతుంది. అప్పటి నుంచి జాతర ఆరంభమైనట్లు గణాచారి ప్రకటిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ నవీన్కుమార్ తెలిపారు. ఈ ఏర్పాట్లను గూడూరు సబ్కలెక్టర్ రాఘవేంద్ర మీన, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్, సేవా కమిటీ సభ్యులు చిల్లకూరు దశరథరామిరెడ్డి, మారాని సుబ్రహ్మణ్యం, సారంగం రమేష్ పర్యవేక్షిస్తారని తెలిపారు.
విద్యుత్ దీపాల వెలుగుల్లో ముత్యాలమ్మ ఆలయం
(ఇన్సెట్) ప్రత్యేక అలంకరణలో ముత్యాలమ్మ
పటిష్ట బందో బస్తు
భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 500 మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు గూడూరు డీఎస్సీ గీతాకుమారి తెలిపారు. రూరల్సీఐ కిశోర్బాబు, చిల్లకూరు ఎస్ఐ సురేష్బాబులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
భక్తులకు కనువిందు చేసేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రతి రోజూ యారా గురనాథస్వామి గ్రామోత్సవంతో పాటుగా గొల్లల వేడుకలు ఉండనున్నాయి.
నేటి నుంచి కనుపూరు జాతర
నేటి నుంచి కనుపూరు జాతర