
మహబూబ్నగర్ క్రైం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళతో డబ్బుల విషయంలో ఏర్పడిన గొడవలో ఓ వ్యక్తి సదరు మహిళను గొంతు నులిమి హత్య చేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ హత్య తాజాగా వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని దొడ్డలోనిపల్లికి చెందిన శాంతమ్మ (35) ఒంటరిగా జీవనం సాగించేది. ఈ క్రమంలో ఆమెకు నవాబ్పేట మండలం తీగలపల్లికి చెందిన కృష్ణయ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఐదేళ్లుగా ఇద్దరు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే డబ్బుల వ్యవహారంలో గత కొన్ని రోజులుగా ఇద్దరు గొడవ పడేవారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కూడా గొడవ జరగగా కృష్ణయ్య, శాంతమ్మను గొంతు నులిమి హత్య చేసి పారిపోయాడు. ఇంట్లో మంచంపై పడి ఉన్న శాంతమ్మ మృతదేహన్ని స్థానికులు బుధవారం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాం«దీనాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.