మనోళ్లకు బీపీ, షుగర్‌ ఎక్కువే! | Various types of tests as part of the National Family Health Survey | Sakshi
Sakshi News home page

మనోళ్లకు బీపీ, షుగర్‌ ఎక్కువే!

Jan 5 2025 5:09 AM | Updated on Jan 5 2025 5:09 AM

Various types of tests as part of the National Family Health Survey

33 జిల్లాల్లో 30 ఏళ్లకు పైబడిన వారికి ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే’లో భాగంగా వివిధ రకాల పరీక్షలు 

తెలంగాణలో సెకండ్‌ రౌండ్‌ స్క్రీనింగ్‌లో వెల్లడైన అనేక అంశాలు  

డయాగ్నైజ్‌ చేసిన వారిలో 46 శాతం మందికి షుగర్, 44 శాతం మందికి హైపర్‌ టెన్షన్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజల్లో హైపర్‌ టెన్షన్‌ (రక్తపోటు), డయాబెటీస్‌ మెల్లిటస్‌ (మధుమేహం) కేసులు ఎక్కువే అని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది జనవరి–ఆగస్టు మధ్య చేపట్టిన ఇంటింటి సర్వేలో తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీపీ, షుగర్‌ కేసులు పెరుగుతున్నట్టుగా స్పష్టమైంది. 

గతంలో చేసిన అధ్యయనంలో వెల్లడైన వివిధ అంశాలను బలపరిచేలా తాజాగా విడుదల చేసిన ‘సెకండ్‌ రౌండ్‌ స్క్రీనింగ్, డయాగ్నసిస్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ హైపర్‌ టెన్షన్‌/డయాబెటీస్‌ మెల్లిటస్, తెలంగాణ స్టేట్‌’లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

వివిధ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత ప్రదేశాల్లోనూ బీపీ, షుగర్‌ కేసులు వెలుగులోకి రావడం.. సర్వే నిర్వహించిన వారిని ఆశ్చర్యచకితులను చేసింది. తమకు హైపర్‌ టెన్షన్, డయాబెటీస్‌ ఉందని తెలియకుండానే తమ రోజువారీ జీవితాలను గడుపుతున్న వారిలో అవగాహన కల్పింపంచి, ఆయా అనారోగ్యాలకు తగిన చికిత్స అందించేందుకు ఉద్దేశించి ఈ సర్వే నిర్వహించారు. 

రాష్ట్రవ్యాప్తంగా జీవనశైలి అలవాట్ల కారణంగా ఎదురవుతున్న సమస్యలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలు, తేడాలు గుర్తించేందుకు దీనిని ఎంచుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తమ అనారోగ్య సమస్యలు పెరిగి హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వచ్చి పరీక్షలు నిర్వహించినప్పుడు రక్తపోటు, మధుమేహం బయటపడుతుండడంతో, అన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. 
 
సర్వే చేసింది ఇలా.... 
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 30 ఏళ్లు, ఆపైబడిన టార్గెట్‌ జనాభాకు సంబంధించి బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)–5 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా అంశాల్లో నిర్దేశిత జనాభా శాతానికి అనుగుణంగా రాష్ట్రంలో అధ్యయనం చేశారు.  

మొత్తంగా చూస్తే...30 ఏళ్లకు పైబడిన టార్గెట్‌ పాపులేషన్‌కు సంబంధించి 33 జిల్లాల్లోని 1,68,86,372 మందిని పరీక్షల కోసం గుర్తించారు. ఈ టార్గెట్‌ జనాభాలోని 1,50,28,690 మందిని (89 శాతం) స్క్రీనింగ్‌ చేశారు. వీరిలో ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 ప్రకారం 26 శాతం మందిని అంటే 43,90,457 మందిని పరీక్షించగా 19,31,994 మందికి (అంచనా వేసిన వారిలో 44 శాతం) హైపర్‌టెన్షన్‌ కలిగి ఉన్నట్టుగా తేలింది. 

అదేవిధంగా ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 ప్రకారం 13శాతం మందిని అంటే 21,95,228 మందిని పరీక్షించగా 10,17,253 మందికి (అంచనా వేసిన వారిలో 46 శాతం) డయాబెటీస్‌ మెల్లిటస్‌ కలిగి ఉన్నట్టుగా వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలను పరిశీలించినప్పుడు... రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో నిర్వహించిన పరీక్షలకు అనుగుణంగా... వారిలో 46 శాతం మంది షుగర్‌తో, 44 శాతం మంది బీపీతో బాధపడుతున్నట్టుగా స్పష్టమైంది. 

ఈ సమాచారానికి అనుగుణంగా చూస్తే...రాష్ట్రంలో మొత్తంగా 10,17, 253 మంది మధుమేహంతో, 19,31,994 అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్టుగా డయాగ్నైజ్‌ అ య్యింది. హైపర్‌ టెన్షన్, షుగర్‌లకు సంబంధించి వివిధ జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలించినపుడు...రెండింటిలోనూ టాప్‌–5గా నిలిచిన జిల్లాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.   

Advertisement
 
Advertisement
Advertisement