సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఓ ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. యూఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు.
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నానక్రామ్గూడలోని యూఎస్ కాన్సులేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో రహదారి నామఫలకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అమెరికా రాయబారి సెర్జియో గోర్, హైదరాబాద్లోని యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ సమక్షంలో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం తన ‘ఎక్స్’ వేదికగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్..‘హైదరాబాద్లో కొత్తగా ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ఏర్పాటు చేశారు. ఈ విధంగా గౌరవించబడిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిని నేనే. ధన్యవాదాలు!’ అని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నామకరణం ద్వారా భారత్–అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కార్యక్రమం అనంతరం అమెరికా ప్రతినిధులు కూడా ఈ నిర్ణయాన్ని సానుకూలంగా స్వాగతించినట్లు సమాచారం.


