
జగిత్యాల: కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. వినాయక విగ్రహాలు తరలిస్తుండగా ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో మృతులు బంటిసాయి,వినోద్లుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బాలాజీ కళా ఆర్ట్స్ విగ్రహాల తయారి యజమాని అల్వాల వినోద్, బంటి సాయి అనే ఇద్దరు యువకులు కోరుట్ల పట్టణం శివారులోని వినాయక విగ్రహాల తయారు చేస్తున్నారు. అయితే, ఆదివారం షెడ్డులో ఉంచిన విగ్రహాలు తడిగా ఉండటంతో ఎండలో ఆరబెట్టేందుకు పక్కనే ఉన్న మరో షెడ్డుకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కొండ్రికర్ల నుండి వచ్చే 133/11 కేవీ విద్యుత్ వైర్లకు 13అడుగుల వినాయక విగ్రహాం తగిలింది. దీంతో ఆరు నుంచి తొమ్మదిమందికి విద్యుత్ షాక్ తగిలింది.
విద్యుత్ షాక్తో విలవిల్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలారు. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు కర్రల సాయంతో కరెంట్ షాక్ ప్రమాదాన్ని నిలువరించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.