
ఉపాధి, ఆదాయానికి అవకాశం ఉన్న వాటిపై దృష్టి పెట్టండి
అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి సూచన
హ్యుందాయ్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్కు సబ్ కమిటీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రజాభవన్లో పారిశ్రామిక పెట్టుబడులకు ప్రోత్సాహంపై సబ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో పెట్టుబడులకు ప్రోత్సాహం, ఇప్పటికే చేసుకున్న ఎంవోయూల అమలులో ప్రగతి, కొత్త యూనిట్ల స్థాపనకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఒక పరిశ్రమ స్థాపిస్తే అందుకు అనుబంధంగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్న ప్రతిపాదనలపై దృష్టి పెట్టి వాటిని త్వరితగతిన ఆచరణలోకి తీసుకురావాలని భట్టి అధికారులకు సూచించారు. ఇకపై ప్రతి శనివారం పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఒక పరిశ్రమ ఏర్పాటుతో అనేక అనుబంధ పరిశ్రమలు రావడం తద్వారా రాష్ట్ర యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు, రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరే వ్యూహాత్మక ప్రాధాన్యతను అధికారులు దృష్టిలో పెట్టుకొని ఆ రకమైన ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని సబ్ కమిటీ సూచించింది.
జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతంలో హ్యుందాయ్ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపనకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. 675 ఎకరాల్లో రూ. 8,528 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీ రాష్ట్రానికి రావడం గొప్ప విజయమని కమిటీ అభిప్రాయపడింది. ఈ సెంటర్ ఏర్పాటుతో కొత్తగా 4,276 మంది రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు సమావేశంలో వివరించారు. రీసెర్చ్ సెంటర్లో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్, పైలట్ లైన్, ప్రోటో టైపింగ్ ఉంటాయని వివరించారు. ప్రస్తుతం ప్రారంభమవనున్న పరిశ్రమలు రాబోయేకాలంలో భారీగా ఉపాధి, ఆదాయ అవకాశాలు కలి్పస్తాయని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు.